మోడీకి మరో లేఖ: జయతో గౌతమికి సంబంధం ఏమిటి?
జయలలిత మృతిపై సినీ నటి గౌతమి ప్రధాని మోడీకి మరో లేఖ రాశారు. ఆమె ఎందుకు అకస్మాత్తుగా గొంతు విప్పారు, ఆమెకూ జయకూ మధ్య సంబంధం ఏమిటి...
చెన్నై: జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సినీ నటి గౌతమి ప్రధాని మోడీకి ఆదివారం మరో లేఖ రాశారు. ఆమె ఇది వరకే ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. జయలలితకు అందించిన చికిత్సపై తనకు మాదిరిగానే చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారని ఆమె ఆ లేఖలో అన్నారు. దీనికి సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
సమాధానాన్ని మోడీ నుంచి తాను కూడా ఆశిస్తున్నట్లు తెలిపారు. గౌతమి రాసిన లేఖపై అన్నాడియంకె శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయినా కూడా ఆమె గౌతమి ప్రధానికి రెండో లేఖ రాశారు. జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ గౌతమి ఇలా లేఖలు రాయడానికి కారణం ఏమిటి, ఆమెకు ఉన్న ఆసక్తి ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.
కమల్ హాసన్తో తెగదెంపులు చేసుకున్న తర్వాత ఆమె అకస్మాత్తుగా ఇలా గొంతెత్తడంలోని ఆంతర్యం ఏమిటనేది కూడా ఓప్రశ్నగానే ఉంది. గౌతమి స్వయంగా మాట్లాడుతున్నారు, ఆమెతో ఎవరైనా మాట్లాడిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు జయలలితకు, గౌతమికి ఉన్న సంబంధం ఏమిటి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ విషయాలపై ఆమె సాక్షి దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
జరగకూడనిది జరిగినప్పుడు బాధ..
మన కళ్ల ముందు జరగకూడనిది జరిగినప్పుడు తట్టుకోవడం కష్టమవుతోందని, భరంచలేని బాధ ఉంటుందని, ఆ బాధ మనల్ని మాట్లాడిస్తుందని గౌతమి అన్నారు. ఒక సామాన్య పౌరురాలిగా అసలు జయలలితకు ఇన్నాళ్లు చికిత్స జరగడం వెనక ఏం జరిగిందనేది తెలుసుకునే హక్కు తనకు ఉందని, అందుకే మాట్లాడానని ఆమె అన్నారు.
వ్యక్తిగతంగా నాకు జయ అంటే అభిమానం..
వ్యక్తిగతంగా తనకు జయలలిత అంటే అభిమానమని, గత 20 ఏళ్లలో తాను అనేక సమస్యలను ఎదుర్కున్నానని, ఆ సమయాల్లో జయలలితను తలుచుకునేదాన్నని, జయలలితను ఆదర్శంంగా తీసుకుని సమస్యలను ఎదుర్కున్నానని గౌతమి చెప్పారు. జయలలిత ఏ రేసీ పొలిటికల్ లీడర్ అని, జయ మరణం ఓ మిస్టరీగా మిగిలిపోకూడనది ఆమె అన్నారు.
శశికళ ఉన్నారా అనే ప్రశ్నకు...
జయలలిత మృతిపై శశికళపై అనుమానాలు వ్యక్తం చేయడానికి గౌతమి అంగీకరించలేదు. నమ్మకాలు నిజం కావచ్చు, అపనమ్మకాలు అబద్ధం కావచ్చునని అంటూ వాస్తవం ఏమిటో ముందు తెలుసుకోవాలని తాను ప్రధానిని కోరినట్లు తెలిపారు. అది తెలిసిన తర్వాత ముందుకు సాగవచ్చునని, అలా చేయడం మర్యాద అని ఆమె అన్నారు.
నాకు ఏ అండదండలూ లేవని గౌతమి
జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడం వెనక తనకు ఎవరి అండదండలు కూడా లేవని గౌతమి చెప్పారు. అంత మద్దతే ఉండి ఉంటే తాను ఓ పెద్ద నిర్ణయం తీసుకుని బయటకి వచ్ిచనపపుడు ఎక్కడ ఉండాలో తెలియక ఓ నెల రోజుల పాటు తన ఆఫీసులో ఉండాల్సి వచ్చేది కాదని, ఆ తర్వాత ఇల్లు చూసుకున్నానని ఆమె చెప్పారు.
జయలలితపై అందుకే అభిమానం...
జయలలిత తన పెళ్లికి వచ్చి ఆశీర్వదించారని, ఆ తర్వాత ఓసారి కలిశానని, మూడు నాలుగు నిమిషాలు మాట్లాడి ఉంటానేమోనని, అప్పుడే ఆమె అంటే ఇష్టం ఏర్పడిందని గౌతమి చెప్పారు. ఆడవాళ్లు ధైర్యంగా బతకాలని జయలలిత తన జీవితం ద్వారా చూపించారని, ధైర్యాన్ని కూడగట్టుకోవాలని అనుకునే మహిళకు జయలలిత గొప్ప ఆదర్శమని ఆమె చెప్పారు.
అది ఏ మాత్రం నిజం కాదు..
జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ప్రదాని మోడీ తన లేఖను పోస్టు చేయించారనే ఆరోపణలను గౌతమి ఖండించారు. తాను నడుపుతున్న స్వచ్ఛందా సేవా సంస్థ లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ గురించి మోడీతో మాట్లాడి, ఆయన సలాహాలు తీసుకోవడానికి మాత్రమే కలిశానని గౌతమి చెప్పారు. అంత మాత్రానికే మోడీ ఆయన మనోభావాలను తన భావాలుగా సోషల్ మీడియాలో పెట్టిస్తారా అని ఆమె అడిగారు.
రాజకీయాల్లోకా, రావాలని లేదు...
తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని గౌతమి స్పష్టం చేశారు. ఇంతకు ముందు చెప్పినట్లుగా తన ప్రస్తుత లక్ష్యం తన అమ్మాయి అని, వేరే దేని గురించి కూడా ఆలోచించడం లేదని చెప్పారు. విశ్వరూపం సినిమా సమయంలో జయలలితకు, కమల్ హాసన్కు మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా కమల్ హాసన్పై కోపంతోనే ఇప్పుడు జయలలితపై స్పందిస్తున్నానని అనడంలో నిజం లేదని అన్నారు.