బాబు కొంపముంచిన రూల్స్: మహానాడుకు చుక్కెదురు
టిడిపి విశాఖలో తలపెట్టిన మహానాడు చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. మహానాడు వేదికగా ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ ను ఖరారు చేసినప్పటి నుండి వివాదాలు ఎదురౌతూనే ఉన్నాయి.
విశాఖపట్టణం: టిడిపి విశాఖలో తలపెట్టిన మహానాడు చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. మహానాడు వేదికగా ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ ను ఖరారు చేసినప్పటి నుండి వివాదాలు ఎదురౌతూనే ఉన్నాయి.
ఈ ఏడాది మహానాడును విశాఖపట్టణంలో నిర్వహించాలని టిడిపి నిర్ణయం తీసుకొంది. మహానాడు వేదికను విశాఖపట్టణంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ ను ఖరారుచేశారు విశాఖపట్టణానికి చెందిన పార్టీ నాయకులు.
అయితే కాలేజీకి చెందిన గ్రౌండ్స్ ను మతపరమైన కార్యక్రమాలకు , రాజకీయ కార్యక్రమాలకు విద్యాసంస్థలకు చెందిన ప్రాంగణాల్లో అనుమతించకూడదనే నిబంధన మహానాడు నిర్వహణపై విమర్శలకు కారణంగా మారింది.
మహానాడు వేదిక విషయమై రాజకీయపార్టీల మద్య మాటలయుద్దానికి కారణంగా మారింది.గతంలో ఇతర రాజకీయపార్టీలకు ఈ గ్రౌండ్స్ ను ఇవ్వకుండా మహానాడుకు కేటాయిస్తే విమర్శలు ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదు.
అచ్చొచ్చిన్న గ్రౌండ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తున్నా మీ కోసం పాదయాత్ర ముగింపు సభను టిడిపి ఇదే గ్రౌండ్ లో నిర్వహించింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇదే గ్రౌండ్ లో నిర్వహించింది సభ. ఈ సభ తర్వాత జరిగిన ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చింది.దీంతో ఈ గ్రౌండ్ లో సభ నిర్వహించడం వల్ల తమకు కలిసివచ్చిందనే అభిప్రాయం కూడ లేకపోలేదు.ఈ కారణాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈ గ్రౌండ్ ను ఎంపిక చేశారు విశాఖకు చెందిన పార్టీ నాయకులు.ఈ మహానాడును కూడ ఈ గ్రౌండ్ లో నిర్వహించడం వల్ల పార్టీకి మరింత కలిసివచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది.
అడ్డొస్తున్న నిబంధనలు
ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన గ్రౌండ్ తమకు అచ్చివచ్చిందని టిడిపి నాయకత్వం భావిస్తోంది.అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు ప్రస్తుతం మహానాడు నిర్వహణకు ఇబ్బందిగామారాయి.విద్యాసంస్థ ప్రాంగణాల్లో రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు చేపట్టరాదంటూ కీలక నిర్ణయం తీసుకొంది ప్రభుత్వం.అయితే ఎయూ గ్రౌండ్స్ లో మహానాడు నిర్వహణకు ఇదే నిబంధనను అధికారులు ఇప్పటివరకు పాటిస్తూ వచ్చారు.ఇదే నిబంధన మహానాడుకు ఇబ్బందిగా మారే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇతర పార్టీలు, సంస్థలకు ఈ గ్రౌండ్ ను ఇవ్వకుండా టిడిపి నిర్వహించే మహానాడుకు ఈ గ్రౌండ్ ను ఇస్తే వివాదాస్పదంగా మారే అవకాశాలు లేకపోలేదు.
గతంలో ఎయూ గ్రౌండ్స్ లో సభల నిర్వహణకు అనుమతి నిరాకరణ
గతంలో వైసీపీ ఈ గ్రౌండ్స్ లో జై ఆంధ్రప్రదేశ్, యువభేరి సమావేశాలను నిర్వహించాలని భావించింది.అయితే ఈ ప్రాంగణాన్ని ఇచ్చేందుకు యూనివర్శిటీ అధికారులు నిరాకరించారు. చివరినిమిషంలో వైసీపీ నాయకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొన్నారు.కొద్దిరోజుల క్రితం హిందూ ప్రచారసంస్థ ఒకటి ఎయూ గ్రౌండ్స్ లో సమావేశాన్ని నిర్వహించుకొనేందుకు ఎయూవర్గాలను అనుమతి కోరింది. అయితే వేదికను ఇచ్చేదిలేదంటూ ఎయూవర్గాలు తేల్చిచెప్పాయి.ఈ సంస్థకు తొలుత గ్రౌండ్ ను ఇచ్చేందుకు అద్దె కూడ వసూలు చేసి చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకొన్నారు. దీంతో నిర్వాహాకులు ఇతర వేదికను ఎంచుకోవాల్సి వచ్చింది.
నాటకీయ పరిణామాలు..చివరకు ఎయూ గ్రౌండ్స్ ఖరారు
మహానాడు వేదిక విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి.అయితే చివరకు మాత్రం ఎయూ గ్రౌండ్ ను మాత్రం ఎంపిక చేశారు టిడిపి నాయకులు.ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు గ్రౌండ్స్ లో మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ వేదిక విషయమై వివాదం కొనసాగుతున్న తరుణంలో ఈ విషయమై మంత్రలు మాత్రం నోరుమెదపడం లేదు.అందరికీ అందుబాటులో ఉంటుందనే ఈ గ్రౌండ్ ను ఎంపిక చేసినట్టు ఓ మంత్రి చెబుతున్నారు.అయితే దీనిలో రాజకీయం ఏమీ లేదని ఆయన చెబుతున్నారు.నిబంధనలు కాదని ఎయూ గ్రౌండ్స్ లో మహానాడు నిర్వహణపై వైసీపితో పాటు వామపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.