పాక్ నటులు, సర్జికల్ స్ట్రయిక్: అక్షయ్ కుమార్ షాకింగ్ సమాధానం
ముంబై: యూరి ఉగ్రదాడికి, పాకిస్తాన్ నటులకు ఏం సంబంధమని, పాకిస్తాన్ నటులను బెదిరించడం సరికాదని పలువుర నటీనటులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి వారికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ షాకింగ్ సమాధానం ఇచ్చారు.
ఆర్మీ గురించి ఆలోచించండి
అసలు, పాకిస్థాన్ నటీనటులు, కళాకారులను నిషేధించే విషయం గురించి కాదని, సైన్యం గురించి ఆలోచించాలని హితవు పలికారు. యూరి ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ నటులను నిషేధించాలంటూ చర్చలు అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
సర్జికల్ దాడులు అడగడమా
భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్ దాడులకు సంబంధించి ఆధారాలను అడగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించి అక్షయ్ కుమార్ మాట్లాడిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తాను ఒక సెలబ్రెటీగా మాట్లాడటం లేదని, ఆర్మీ వ్యక్తి కొడుకుగా మాట్లాడుతున్నానని చెప్పారు.
యుద్ధం జరుగుతుందని భయపడుతున్నారు
కొంతమంది సర్జికల్ స్ట్రయిక్ దాడుల గురించి ఆధారాలు అడుగుతుంటే, మరికొంతమంది పాకిస్తాన్ నటులను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారని, ఇంకొందరేమో యుద్ధం జరుగుతుందేమో అని భయపడుతున్నారని వీడియోలో పేర్కొన్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమన్నారు.
ఇండియన్ ఆర్మీ
దేశ భద్రతను కాపాడే తరుణంలో పందొమ్మిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, బారాముల్లా ఉగ్రదాడిలో ఇరవై నాలుగేళ్ల నితిన్ యాదవ్ ప్రాణాలు కోల్పోయాడని గుర్తు చేశారు. సినిమాలు ఆడతాయా లేదా? నటులపై నిషేధం విధిస్తారా లేదా? అనే ఆలోచన కాదని, వారి భవిష్యత్తు ఏమవుతుందా అని ఆందోళన చెందుతున్నారని అన్నారు. సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాల గురించి ఒక్కసారి ఆలోచించాలని హితవు పలికారు.
సర్జికల్ స్ట్రయిక్
అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత ఒకరు.. సర్జికల్ స్ట్రయిక్ దాడులను బయట పెట్టాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్ ఎవరి పేరు ఎత్తకుండా అది సరికాదని చెప్పారు.
పాక్ నటుల గురించి కాదు..
ఇక, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, రాధికా ఆప్టే, ఓంపురి తదితరులు పాకిస్తాన్ నటులతో నటించేందుకు తాము సిద్ధమని, ఉగ్రదాడులకు పాకిస్తాన్ నటులను బహిష్కరించడానికి సంబంధం ఏమిటని వివిధ రకాలుగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, ఉగ్రదాడిని అదే పాకిస్తాన్ నటులు ఖండించగలరా అని నిలదీసిన వారు కూడా ఉన్నారు.