జిహెచ్ఎంసిలో రఘు లీలలు: అతనుంటే చాలు...
ఏపీ ఏసీబీ దాడుల్లో పట్టుబడి జైలుకు వెళ్లిన డైనో‘సార్' అధికారి గోళ్ల వెంకట రఘురామిరెడ్డి హైదరాబాద్లో పాల్పడ్డ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్: ఏపీ ఏసీబీ దాడుల్లో పట్టుబడి జైలుకు వెళ్లిన డైనో'సార్' అధికారి గోళ్ల వెంకట రఘురామిరెడ్డి హైదరాబాద్లో పాల్పడ్డ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైద్రాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో పనిచేసే సమయంలో కూడ డబ్బులకు ఆశపడి నిబంధనలకు ఉల్లంఘించారనే చర్చ సాగుతోంది.
నిబంధనలను ఉల్లంఘించి సెక్షన్లకు పక్కనపెట్టి అడ్డగోలుగా జిహెచ్ఎంసి పరిధిలో అనుమతులు మంజూరు చేశారనే ఆరోపణలు రఘుపై వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రఘు ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు. దీంతో తన సర్వీసులో పనిచేసిన చోట ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డారనే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
రఘు గతంలో పనిచేసిన ప్రాంతాల్లోని ట్రాక్ రికార్డును కూడ అధికారులు పరిశీలిస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు నిబంధనలను పక్కనపెట్టి ప్రయోజనం కల్పించేందుకు రఘు ఏ మాత్రం వెనుకాడకపోయేదనే అభిప్రాయాలు జిహెచ్ఎంసి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
కనీస వసతులు లేకున్నా, నిర్మాణ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నా డెవలపర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో రఘు సాహసం చేసేవారని పలువురు జిహెచ్ఎంసి ఉద్యోగులు గుర్తుచేసుకొంటున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో రఘు పనిచేసే సమయంలో ఏయే డెవలపర్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించారనే విషయమై మీడియాలో కథనాలు వచ్చాయి. ఏ రకంగా రఘు ఆయా కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించారు, నష్టపోయినవారు కోర్టులను ఆశ్రయించిన విషయాలను ఆ కథనాల్లో ప్రచురించారు.
నిబంధనలకు విరుద్దంగా అనుమతులు
రఘు జిహెచ్ఎంసి పరిధిలో పనిచేసిన సమయంలో నిబంధనలను తుంగలో తొక్కారని జిహెచ్ఎంసి వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.ప్రముఖ నిర్మాణ కంపెనీలకు మేలు చేసేందుకు రఘు జంకు గొంకు లేకుండా అడుగడుగునా రూల్స్ బ్రేక్ చేశారంటున్నారు. వసతులు లేకున్నా.. నిర్మాణ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నా డెవలపర్లకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నాడనే ఆరోపణలున్నాయి. డెవల్పమెంట్కు ఇచ్చిన స్థలంలో ప్రాజెక్టుల ప్లాన్ రివైజ్ చేసినపుడు భూయజమానుల అభిప్రాయం తీసుకోకుండా ఇష్టానికి అనుమతులిచ్చాడనే చర్చ రఘుపై ఉంది.
39 భవనాలకు నిబంధనలకు విరుద్దంగా అనుమతులు
ఒక ప్రాజెక్టులో ఉన్న వసతులను పరిగణనలోకి తీసుకొని పక్కనే ఉన్న స్థలంలో మరో బహుళ అంతస్తుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని రఘుపై ఆరోపణలున్నాయి. అదీ ఒక్కో ఫ్లాట్ కోటి నుంచి కోటిన్నర ధర పలికే ప్రాంతంలో 39 భవనాలకు అడ్డంగా అనుమతులిచ్చాడని రఘుపై విమర్శులున్నాయి.డెవలపర్లకు మేలు చేసినందుకు గాను రఘుకు భారీగా ముడుపులు అందాయనే ప్రచారం సాగుతోంది.
శేరిలింగంపల్లిలో ఇలా
శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్నగర్ సర్వే నెంబర్ 14(పార్ట్), కొత్తగూడ సర్వే నెంబర్ 20(పార్ట్), కొండాపూర్ సర్వే నెంబర్ 57(పార్ట్)లో ఉన్న ఆరు ఎకరాలను కొందరు ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులు 47 మంది 1992, 1994లలో కొనుగోలు చేశారు.2007లో ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో డెవల్పమెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. నిర్మాణ విస్తీర్ణం తక్కువైనా ఫర్వాలేదు. టాట్ లాట్స్(పార్కు, గ్రీనరీ), క్లబ్ హౌస్ వంటి మౌలిక వసతులు ఉండాలని ఒప్పందం రాసుకున్నారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన దానికంటే ఐదు శాతం అధికంగా వసతుల కల్పనకు స్థలం వదిలారు. గ్రౌండ్ ప్లస్ ఏడంతస్తుల చొప్పున ఐదు బ్లాక్లు, రెండు సెల్లార్లకు అనుమతి కోసం ఆదిత్య హోమ్స్ మే 22, 2007లో జీహెచ్ఎంసీలో దరఖాస్తు చేసింది. ఏ, బీ, సీ, డీ, ఈ పేరిట ఉండే ఒక్కో బ్లాక్లో 64 ప్లాట్లు నిర్మించనున్నట్టు ప్లాన్లో పేర్కొన్నారు. అక్కడ అప్రోచ్ రోడ్డు 30 అడుగులే ఉండడంతో 10 అడుగుల స్థలం ఇచ్చేందుకూ అంగీకరించారు. దీంతో జనవరి 7, 2008లో కొండాపూర్ మార్గంలో ప్రస్తుతం ఆదిత్య సన్షైన్ పేరిట 23,903 .57 చదరపు మీటర్ల నిర్మాణ విస్తీర్ణంలో ఉన్న బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతి లభించింది. జనవరి 29, 2011 లోపు ప్రాజెక్టు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ గడువు నిర్దేశించింది. ఇదంతా రఘు జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్గా రాక ముందు జరిగింది. రఘు హయాంలో నిబంధనలు ఉల్లంఘన మొదలైందనే ఆరోపణలు ఉన్నాయి.
రివైజ్డ్ ప్లాన్ పేరుతో ఇలా..
ఆదిత్య సన్షైన్ ప్రాజెక్టు పక్కన ఉన్న మరో వ్యక్తికి చెందిన ఎకరం స్థలాన్నీ ఆదిత్య బిల్డర్స్ డెవల్పమెంట్కు తీసుకుంది. మార్చి 9, 2011లో ఆ స్థలంలోనూ గ్రౌండ్ ప్లస్ ఏడంతస్తులు, సెల్లార్ నిర్మాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేశారు. బ్లాక్ ఎఫ్ పేరిట 39 ఫ్లాట్లు నిర్మించాలని నిర్ణయించారు. 23903.57 చదరపు మీటర్లకు అదనంగా ఎఫ్ బ్లాక్లో 3600 చదరపు మీటర్ల మేర నిర్మాణ పనులు చేపడుతున్నట్టు రివైజ్డ్ ప్లాన్లో చూపారు. మార్చి 20, 2013న అనుమతి ఇచ్చారు. అప్పటికే సన్షైన్ ప్రాజెక్టు నిర్మాణ గడువు ముగిసింది. రివైజ్డ్ ప్లాన్ అని చూపినా పర్మిషన్ లెటర్లో మాత్రం సన్షైన్ ప్రాజెక్టు నిర్మాణ విస్తీర్ణం 23,903.57 చదరపు మీటర్లే ఉంది. ఆ సంస్థ రివైజ్ట్ ప్లాన్కు అనుమతి చేసుకున్న 11 రోజుల్లోనే అనుమతి పొందడం విశేషం.తక్కువ స్థలం ఉండడంతో సన్షైన్లో కల్పించిన వసతులను కొత్తగా దరఖాస్తు చేసిన ఎఫ్ బ్లాక్ ఎమినిటీస్ గా చూపాడు. ఇది నిబంధనలకు విరుద్ధం. జీఓ నెంబర్ 86లోని ప్రొవిజన్ 9.10 సబ్ సెక్షన్ 2 ప్రకారం ప్లాన్ సవరించినా, అదనంగా నిర్మాణాలు చేపట్టినా స్థల యజమానుల కౌంటర్ సిగ్నేచర్ ఉండాలి.
లోకాయుక్తలో కేసు
పక్క పక్కనే ఉన్న రెండు వెంచర్ల మధ్య ప్రహరీ నిర్మించారు. పనులు ప్రారంభమైన అనంతరం సామగ్రి తరలించే వాహనాల రాకపోకల కోసమంటూ ప్రహరీ తొలగించారు. 2013లో మొదలైన పనులు 2015లో పూర్తయ్యాయి. పనులు పూర్తయ్యాక ప్రహరీ నిర్మిస్తామని చెప్పిన నిర్మాణ సంస్థ తాపీగా ‘సన్షైన్ ప్రాజెక్టులో అదనపు వసతులు ఉన్నాయి.. ఎఫ్ బ్లాక్లో ఉండేవారూ వినియోగించుకుంటారు' అని చెప్పారు. దీనిపై ఆదిత్య సన్షైన్ వాసులు అభ్యంతరం తెలిపారు. ఎఫ్ బ్లాక్, తమ నివాసాల మధ్య కాంపౌండ్ వాల్ నిర్మించాలని కోరారని జీహెచ్ఎంసీ అధికారి వివరించారు. అనుమతి వివరాలపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. అక్కడున్నది గోళ్ల వెంకట రఘురామిరెడ్డి. ప్లాన్లతో సహా సమాచారం ఇవ్వాలంటే ప్రింటింగ్ ఖర్చు రూ.7.5 లక్షలు చెల్లించాలని రఘు సమాధానమిచ్చాడు. పలుమార్లు ఫిర్యాదు చేసినా జీహెచ్ఎంసీ పట్టించుకోకపోవడంతో యజమానులు లోకాయుక్తలో పిటిషన్ వేశారు. సనత్నగర్లోనూ ఐదంతస్తుల మేర పలు బ్లాక్లుగా నిర్మించిన ప్రాజెక్టుకూ రఘు హయాంలోనే అక్రమంగా అనుమతులు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.