కెసిఆర్కు ఎసరు: కమలనాథుల పక్కా ప్లాన్ ఇదీ...
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చారిత్రక విజయం అందించిన ధీమాతో కమలనాథులు తెలంగాణపై దృష్టి సారించారా? అంటే అవుననే సమాధానం లభిస్తున్నది. కాంగ్రెస్ అంతర్గత విభేదాలతో.. వలసలతో నిర్వీర్యమై టీడీపీ చేతులెత్తేస్తున్నాయన్న అంచనా మధ్య బీజేపీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బలోపేతం కావడానికి అవసరమైన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నందు వల్లే టీఆర్ఎస్కు తామే సరైన ప్రత్యామ్నాయమని ఇటీవల కమలనాథులు పదేపదే చెప్తున్నారు.
టీఆర్ఎస్లో అంతర్గతంగా జరుగుతున్న చర్చలు, ప్రతివ్యూహంపై కొనసాగుతున్న సమాలోచనలతో ఈ అలను బట్టి చూస్తే ఇవే అభిప్రాయాలు కలుగుతున్నాయి. రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలను టీఆర్ఎస్ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోందని అవగతమవుతున్నది. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే టీఆర్ఎస్ దూకుడు పెంచింది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతంపై దృష్టి పెట్టింది.
పార్టీ 16వ ప్లీనరీ సందర్భంగా జిల్లాకో మినీ బహిరంగ సభ నిర్వహణ ద్వారా కేడర్ను సమీకరించుకుని, స్థిర పరుచుకోవడానికేనన్నది స్పష్టమవుతోంది. బీజేపీ తెలంగాణపై దృష్టి పెట్టిందని గుర్తించినందు వల్లే టీఆర్ఎస్ ఇంత దూకుడుగా వెళ్లుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. హస్తినలో బీజేపీ అధి నాయకత్వం అండదండలతో, కనుసన్నల్లో వ్యవహరిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు ప్రణాళికతో, వ్యూహం ప్రకారం ముందుకు సాగుతున్నారని టీఆర్ఎస్ అంచనాకు వచ్చిందని చెబుతున్నారు.
ఇదీ బీజేపీ ప్లాన్
రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఏడు లోక్సభ నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. అందులో ఆరు నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులను ఇన్చార్జిలుగా నియమించి.. నియోజకర్గ స్థాయి సమావేశాలు నిర్వహించాలని తలపెట్టింది. భువనగిరిలో జరిగిన తొలి లోక్ సభ నియోజకవర్గ స్థాయి సమావేశానికి కేంద్ర మంత్రి జవదేకర్ హాజరయ్యారు. రాష్ట్ర రాజధాని కేంద్రమైన హైదరాబాద్ లోక్ సభ స్థానానికి ఇన్చార్జిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా కార్యరంగంలోకి దిగుతున్నారని, నిజామాబాద్కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, కరీంనగర్కు పురుషోత్తం రూపాల, మహబూబ్నగర్లో అనంత్ కుమార్, వరంగల్కు పొన్ను రాధాకృష్ణ ఇన్చార్జిగా వ్యవహరిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
సికింద్రాబాద్ నుంచి బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఇక్కడి నుంచి దత్తాత్రేయ కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. ఇక మల్కాజిగిరి, మెదక్ లోక్సభ స్థానాల్లో ఒక దానికి కూడా ఇన్చార్జి బాధ్యతలను ఓ కేంద్ర మంత్రికి అప్పజెప్పనున్నట్లు తెలుస్తున్నది. లోక్ సభా స్థానాలతోపాటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గాల నుంచి గతంలో బీజేపీ గెలిచిన అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నారని.. వాటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లోనూ పట్టు పెంచుకునే దిశలో బీజేపీ అడుగులు వేస్తోందన్న సమాచారాన్ని టీఆర్ఎస్ సేకరించినట్లు తెలుస్తోంది. కనీసం 35 అసెంబ్లీ స్థానాలపై బీజేపీ దృష్టి పెట్టనున్నదని తెలుస్తున్నది.
ఏడాది చివర్లో బీజేపీలోకి భారీగా వలసలు
టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ రాష్ట్రంలో బలమైన రెడ్డి సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. కాంగ్రెస్, టీడీపీల్లో ఉన్న ఆ సామాజికవర్గం ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలో చేర్చుకునేందుకు మంతనాలు జరుపుతోంది. ఆయా అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో బలమైన నేతలుగా ముద్రపడ్డ వారి వివరాలు సేకరించి వారితో ఢిల్లీ నేతలే రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తున్నది. కొద్దికాలం క్రితం టీఆర్ఎస్లో చేరిన ఓ పార్లమెంట్ సభ్యుడితో బీజేపీ సీనియర్ నేత ఒకరు ఢిల్లీలో మంతనాలు జరిపారు. కొందరు కాంగ్రెస్ నాయకులతోనూ బీజేపీ నేతలు చర్చిస్తున్నారని విశ్వసనీయ వర్గాల కథనం. ఈ ఏడాది చివరికల్లా తెలంగాణలో బీజేపీలోకి భారీ వలసలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
అసెంబ్లీ స్థానాల్లో పార్టీ బలంగా ఉందన్న అంచనా
టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కె చంద్రశేఖర్రావు ఇటీవల ఎంపీల పనితీరుపై నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 17 లోక్సభ స్థానాలకు 15 చోట్ల టీఆర్ఎస్ గెలుస్తుందని పార్టీ నేతల అంతర్గత సమావేశంలో ప్రకటించారు. సికింద్రాబాద్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని, హైదరాబాద్ స్థానం ఎంఐఎం ఖాతాలో చేరుతుందన్న అభిప్రాయంతో టీఆర్ఎస్ ఉంది. ఇక ఎమ్మెల్యేల పనితీరుపై, అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పరిస్థితిపై కూడా కేసీఆర్ సర్వే చేయించారు. వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలు సరిగాలేని చోట కూడా పార్టీ పరిస్థితి బాగుందన్న విషయం సర్వేలో తేలడంతో ఆయన ధీమాగానే ఉన్నారు. కానీ ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగడం, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో భారీ విజయంతో ఆత్మవిశ్వాసంలో ఉన్న బీజేపీ.. తెలంగాణపై దృష్టి సారించిందన్న విషయాన్ని టీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది.
ప్రతివ్యూహ రచనలో గులాబీ పార్టీ
ఇప్పటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్నా, తాజాగా బీజేపీ కొత్త వ్యూహాలతో బరిలోకి దిగడంతో అధికార పార్టీ అప్రమత్తమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందువల్లే సంస్థాగత కార్యక్రమాలను పెంచిందని విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీ తెలంగాణపై దృష్టి పెట్టిందన్న విషయాన్ని ఓ అధికార పార్టీ ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా.. ‘ప్రతి రాజకీయ పార్టీకి వారి వారి వ్యూహాలు ఉంటాయి. ‘కమ్యూనల్' భావోద్వేగాలను రేకెత్తించే అవకాశాలు ఉన్న ప్రాంతాలపై వారు (బీజేపీ) దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు హిందూ సంఘాల నేతలు వాటిలో కొన్ని చోట్ల మీటింగులు కూడా పెట్టిపోయారు. అయినా టీఆర్ఎస్ ఎందుకు బెంబేలు పడిపోవాలి. ఎవరి రాజకీయం వారిదే. మా పార్టీకి ప్రజల ఆదరణ తప్పక ఉంటుంది..''అని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ దూకుడును తేలిగ్గా తీసుకోవడం లేదని, ప్రతివ్యూహ రచనలో టీఆర్ఎస్ ఉందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.