కేసీఆర్ ఆఫర్పై గుత్తా ఫిట్టింగ్, కోమటిరెడ్డి కొత్త ఝలక్
నల్గొండ: తెలంగాణలో విపక్ష కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి పెద్ద ఎత్తున అధికార తెరాసలో చేరుతున్నారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు ఈ రెండు పార్టీల నుంచి కారు ఎక్కారు. తాజాగా, నల్గొండ జిల్లా పైన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇందులో భాగంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెరాసలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఆయితే, వారు తెరాసలో చేరవద్దని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు నేతలు తెరాసలో చేరడంపై ఆసక్తి చూపించక పోవడానికి కారణం మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ఓ కారణమని తెలుస్తోంది.
తెరాసలో చేరితే జగదీశ్వర్ రెడ్డితో పొసగదని వారు భావిస్తున్నారని తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకట రెడ్డి శనివారం ఉదయం మంత్రి హరీష్ రావును కలవడం చర్చనీయాంశమైంది. అయితే, హరీష్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానని, నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై ఆయనతో చర్చించానని కోమటిరెడ్డి చెప్పారు.
అలాగే, గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తెరాసలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఈయన కూడా తెరాసలో చేరేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. తాము తెరాసలో చేరితే మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు తమకు మంత్రి పదవి ఇవ్వాలని గుత్తా కోరినట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ అందుకు సిద్ధంగా లేరని సమాచారం. అలాగే, మంత్రి జగదీశ్వర్ రెడ్డి వంటి వ్యక్తికి నల్గొండలో ప్రాధాన్యం తగ్గించే ఆలోచన కూడా కేసీఆర్కు లేదంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో చేరే వారు మంత్రి పదవి, జగదీశ్వర్ రెడ్డి అంశాన్ని తేకుండానే చేరాలని కేసీఆర్ చెబుతున్నారని తెలుస్తోంది.
వస్తున్న వార్తల మేరకు.. మిర్యాల కూడా ఎమ్మెల్యే భాస్కర రావుతో కలిసి గుత్తా తెరాసలో చేరుతారని వార్తలు వచ్చాయి. ఆయన కేసీఆర్ను కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ సమయంలో తెరాసలోకి రావాలని గుత్తాను కేసీఆర్ ఆహ్వానించారని తెలుస్తోంది.
కేసీఆర్ ఆఫర్ను తిరస్కరించకుండానే, గుత్తా మాట్లాడుతూ.. తాను పార్టీ మారితే, కాంగ్రెస్ తన పైన ఫిర్యాదు చేస్తే స్పీకర్ వేటు వేస్తారని, అప్పుడు ఇబ్బంది ఎదురవుతుందని, అప్పుడు తాను ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని చెప్పారని తెలుస్తోంది. అయితే, ఎమ్మెల్సీ సీటు, మంత్రి పదవి ఇస్తే తాను తెరాసలో చేరుతానని చెప్పారని తెలుస్తోంది.
ఇప్పటికే సుఖేందర్ రెడ్డి సోదరుడు తెరాసలో చేరారు. మరో బంధువు తెరాస నేత. గుత్తా ఇంకో కాంట్రాక్టర్ అయిన బంధువు రూ.1000 కోట్ల ప్రాజెక్టులు దక్కించుకున్నారని తెలుస్తోంది. గుత్తా మాత్రం ఎమ్మెల్సీ, మంత్రి పదవి హామీతోనే తెరాసలో చేరాలని భావిస్తున్నారని, దానికి కేసీఆర్ నుంచి హామీ రాకపోయేసరికి.. చేరికపై తగ్గారని తెలుస్తోంది.
కేసీఆర్తో భేటీ అనంతరం మాట్లాడుతూ.. తాను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, రేపు ఏం జరుగుతుందో తెలియదని చెప్పడం గమనార్హం. మిషన్ భగీరథ, ఇతర పథకాలపై ఆయన ప్రశంసలు గురిపించడం గమనార్హం. అలాగే, సీఎం కేసీఆర్ కూడా మిర్యాలగూడ తెరాస ఎమ్మెల్యే భాస్కర రావు పైన ప్రసంసలు కురిపించారు.
నియోజకవర్గంలో నాలుగవేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు కోసం ఎమ్మెల్యే భాస్కర రావు బాగా కృషి చేశారన్నారు. భాస్కర రావును కూడా తెరాసలో చేరాలని కేసీఆర్ ఆహ్వానించారని, దానికి ఆయన కూడా జానా రెడ్డి పేరు చెప్పి తప్పించుకున్నారని తెలుస్తోంది. అయితే, నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకునే అంశంలో కేసీఆర్ విఫలమైనప్పటికీ... నల్గొండ కాంగ్రెస్లో విభేదాలు రావడం తెరాసకు లాభమే అంటున్నారు.