నిజాం నిధిపై భారత్కి ఫైన్ కట్టండి: పాక్కు షాక్, 1948 నుండి..
లండన్: హైదరాబాద్ నిజాం నవాబుల కాలం నాటి నిధులకు సంబంధించిన కేసులో భారత్కు అనుకూలంగా బ్రిటన్ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పాకిస్తాన్ వైఖరిని తప్పు పట్టడంతో పాటు భారత్కు రూ.1.35 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. బ్రిటన్ కోర్టు తీర్పుతో రూ.315 కోట్లు వెనక్కి తెచ్చుకునే వీలు కలిగిందని చెప్పవచ్చు.
సెప్టెంబర్ 20, 1948 హైదరాబాద్ సంస్థానం నిజాం పాలన నుంచి విముక్తమై భారత దేశంలో విలీనమై రెండు రోజులైంది. అప్పుడే దాయాదులు భారత్, పాకిస్థాన్ల మధ్య దశాబ్దాల తరబడి కొనసాగే లిటిగేషన్కు అంకురార్పణ జరిగింది. నిజాం సంస్థానంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన నవాజ్ జంగ్ 10,07,940 పౌండ్ల తొమ్మిది షిలింగ్లను లండన్లోని పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధిగా ఆ దేశ హైకమిషనర్ హెచ్ఐ రహీమ్తులాకు చెందిన నేషనల్ వెస్ట్మినిస్టర్ బ్యాంక్లోని ఖాతాలో జమ చేశారు.
బ్రిటిషర్లు భారత్ను విడిచిన తర్వాత హైదరాబాద్ సంస్థానం ఒక ఏడాది పాటు స్వతంత్ర రాజ్యంగా ఉంది. విలీనం జరిగిన రెండు రోజుల అనంతరం జరిగిన ఈ నిధుల బదలాయింపునకు తన అనుమతి లేదని అప్పటి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 27 సెప్టెంబర్ 1948న చెప్పినా ప్రయోజనం లేకపోయింది. హైదరాబాద్ సంస్థానం అప్పటికే ఉనికిని కోల్పోవడంతో ఖాతాదారు నవాజ్ జంగ్ అనుమతి లేకుండా ఆ నిధులను వెనక్కు మళ్లించలేమని బ్యాంక్ తేల్చి చెప్పింది.
సంస్థానం ఉనికిలో ఉండి ఉంటే ఆర్థిక మంత్రి ఖాతా అయినా అధినేతగా ఆయా లావాదేవీల్లో నిజాందే తుది మాటగా చెల్లుబాటయ్యేది. ఇది తెలిసే.. తెలివిగా నవాజ్ జంగ్ పాక్కు అనుకూలంగా వ్యవహరించి అప్పట్లో ఆ నిధులను పాక్కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో నిజాం ఆ నిధుల కోసం కోర్టుకెక్కారు.
అయితే నిజాం ఇప్పుడు స్వతంత్ర పాలకుడు కాడని, ఒకప్పటి హైదరాబాద్ సంస్థానానికి చెందిన ఆ నిధులు తమకు చెందుతాయని భారత్ వాదించడంతో కేసులో న్యాయ వివాదం ముదిరింది. ఈ వివాదం 67 ఏళ్లుగా కొనసాగుతూ ఇప్పుడు లండన్లోని హైకోర్ట్ చాన్స్రైలో ఉంది.
పేటెంట్లు, వ్యాపార లావాదేవీలు, అంతర్జాతీయ వ్యాపార వివాదాలకు సంబంధించి బ్రిటన్లో సుప్రీం కోర్టు తర్వాత హైకోర్టు చాన్స్రై అనేది అత్యున్నత కోర్టు. ఇప్పుడా కేసుకు పాకిస్తాన్ సార్వభౌమాధికారానికి లింకు లేదని హైకోర్టు చాన్స్రై ధర్మాసనం తేల్చి చెప్పింది. మొత్తం ఈ కేసులోని భారత్తో సహా ఇతర పార్టీలకు న్యాయప్రక్రియ ఖర్చుల కింద 4లక్షల పౌండ్లను (సుమారు రూ. 3కోట్ల 72లక్షలు)చెల్లించాలని లండన్లోని పాక్ హైకమిషనర్ను ఆదేశించింది. ఇందులో సుమారు రూ. కోటి 34 లక్షలు భారత్కు చెల్లించాలని ఆదేశించింది.
మిగిలిన మొత్తంలో 1.32 లక్షల పౌండ్లు (సుమారు రూ. కోటి 23 లక్షలు) నేషనల్ వెస్ట్ మినిస్టర్ బ్యాంక్కు అంటే ఇప్పటి రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్కు, రూ. 56 లక్షలు నిజాం వారసులకు ఇవ్వాలంది. దీంతో ఈ సొమ్మును భారత్కు తేవడానికి వెసులుబాటు లభించింది.
న్యాయపోరాటం మొదలైన దశాబ్దం తర్వాత కేసు భారత్ వైపు మొగ్గు చూపుతోంది అన్న తరుణంలో పాకిస్తాన్ తన సార్వభౌమాధికారాన్ని తెరపైకి తెచ్చింది. ఆ నిధులకు తన సార్వభౌమాధికారానికి ముడిపెడుతూ సావరిన్ ఇమ్యూనిటీని తెరపైకి తెచ్చింది. దీంతో బ్రిటన్ పార్లమెంటులో ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్ కేసు ప్రొసీడింగ్స్ను ఆపి వేసింది. కేసు మరింత సంక్లిష్టంగా మారింది. రెండు దేశాల సార్వభౌమాధికారానికి ప్రతీకగా నిలిచింది.
సుమారు రూ.350 కోట్ల సొమ్ము కోసం న్యాయ ప్రక్రియను దశాబ్దాల పాటు నడిపాయి. కాలక్రమేణా ఆ నిధులున్న బ్యాంకు కూడా రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్గా రూపాంతరం చెందింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనంతరం ఆయన వారసులు నిజాం మనవడు నవాబ్ నజఫ్ అలీ ఖాన్ ద్వారా ఈ కేసులో పార్టీగా చేరారు. కేసులో ముఖ్యమైన సంక్లిష్టమైన లింకు తెగిపోయిన నేపథ్యంలో ఆ నిధుల గురించి భారత్.. నిజాం వారసులతో చర్చిస్తోందని సమాచారం.