వార్నింగ్!: నేడు మరో సైబర్ దాడి? ఆర్బీఐ, ఆధార్లను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం జరిగిన తొలి అతి పెద్ద సైబర్దాడితో వివిధ దేశాల్లోని పలు వ్యవస్థలు కలవరపడుతున్న నేపథ్యంలో.
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం జరిగిన తొలి అతి పెద్ద సైబర్దాడితో వివిధ దేశాల్లోని పలు వ్యవస్థలు కలవరపడుతున్న నేపథ్యంలో.. మరో హెచ్చరిక! సోమవారం హ్యాకర్లు మరోసారి దాడికి పాల్పడే ప్రమాదముందని భద్రతా నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు 'వన్నాక్రై' లేదా 'వన్నా డిక్రిప్టర్' పేర్లతో రాన్సమ్వేర్ను ఉపయోగించి అనూహ్య దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు అంతర్జాతీయంగా దర్యాప్తు బృందం ప్రయత్నిస్తోంది. ఈ మాల్వేర్ ఫలితంగా ఇప్పటి వరకు 150 దేశాల్లో రెండు లక్షలకుపైగా కంప్యూటర్ వ్యవస్థలు ప్రభావితమయ్యాయని ఓ అంచనా.
పొంచి ఉన్న సైబర్ దాడి?
సోమవారం నుంచి మళ్ళీ వాణిజ్య, అధికార కార్యకలాపాలు ప్రారంభమవుతున్నందున హ్యాకర్లు మరోసారి దాడికి పాల్పడే ప్రమాదముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు ముందుజాగ్రత్తగా నివారణ చర్యలు చేపడుతున్నాయి.
భారత్ లో ముందస్తు జాగ్రత్తలు...
భారతదేశంలో సైబర్ దాడి ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందుచూపుతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వన్నాక్రై రాన్సమ్వేర్కు సంబంధించిన సమాచారాన్ని సేకరించాల్సిందిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సెర్ట్)ను కోరింది.
డిజిటల్ పేమెంట్స్ దెబ్బతినకుండా...
దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎకో సిస్టమ్ దెబ్బతినకుండా కీలకమైన రిజర్వుబ్యాంకు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూఐడీఏఐ (ఆధార్) తదితర విభాగాల్లోని వ్యవస్థలను పరిరక్షించుకోవాలని ఐటీ మంత్రిత్వశాఖ సూచించింది.
ఇప్పటికే రెడ్ కలర్ క్రిటికల్ అలర్ట్...
ఇండియన్ ఇంటర్నెట్ డొమైన్కు హ్యాకింగ్, ఫిషింగ్ ప్రమాదాన్ని నిరోధించి భద్రత సంబంధ రక్షణ వ్యవస్థలను పటిష్ఠం చేసే సెర్ట్ ఇప్పటికే రెడ్ కలర్ క్రిటికల్ అలర్ట్ను జారీచేసింది. తాజా సైబర్దాడి నేపథ్యంలో బ్యాంకులు, ఎయిర్పోర్టులు, టెలికం నెట్వర్కులు, స్టాక్మార్కెట్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.
‘లాన్'తో జాగ్రత్త...
ఒక కంప్యూటర్లో చొరబడిన రాన్సమ్వేర్ ఆ నెట్వర్క్ అంతటికీ వ్యాపిస్తుందని సెర్ట్ తెలిపింది. యూజర్లు ఇన్ఫెక్షన్కు గురయినదానిని వెంటనే లోకల్ ఏరియా నెట్వర్క్ (లాన్) నుంచి తొలగించాలని సెక్యూరిటీ సంస్థలు సూచిస్తున్నాయి.
జాగ్రత్త.. ఓఎస్ అప్ డేట్ ముఖ్యం..
దేశవ్యాప్తంగా యూజర్లు, ప్రత్యేకించి ప్రైవేటు రంగ సంస్థలు పొరపాటున ఈ రాన్సమ్వేర్ బారినపడకుండా చూడాలని డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్సీఐ), సీడీఏసీలను కోరింది. మైక్రోసాఫ్ట్ కూడా తన భాగస్వాములకు, వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని అందజేయాలని, ప్యాచ్లను వినియోగించాల్సిందిగా చెప్పాలని విజ్ఞప్తి చేసింది.
హ్యాకర్లు వైరస్ ను అప్ గ్రేడ్ చేస్తే కష్టమే..
‘శుక్రవారం నాటి సైబర్ దాడిని మనం యాదృచ్ఛికంగా నిరోధించగలిగాం. కానీ వారు మళ్లీ దాడికి పాల్పడే ప్రమాదముంది. సోమవారం ఉదయం ఇది జరగొచ్చు. హ్యాకర్లు కిల్ స్విచ్ను తొలిగించేలా వైరస్ను అప్గ్రేడ్ చేసే అవకాశముంది. వన్నా క్రిప్ట్ వెర్షన్ 1ను నిరోధించవచ్చు కానీ వెర్షన్ 2.0 కిల్ స్విచ్ను అధిగమించగలుగుతుంది. సాధ్యమైనంత త్వరగా ప్యాచ్ను వినియోగించడమే సురక్షితం..' అని ఓ బ్రిటన్ సెక్యూరిటీ రీసెర్చర్ ఆదివారం బీబీసీకి చెప్పారు.