ఏసీఐసీఎస్ రద్దు: అమెరికాలో తెలుగు విద్యార్థుల భవిష్యత్ ఆగమ్యగోచరం
అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా అమెరికాలో చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతీయ టెక్కీలతోపాటు విద్యార్థులకు కూడా కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా అమెరికాలో చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. వీరిలో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉండటం గమనార్హం. అమెరికా విద్యా శాఖ తీసుకున్నఒక సంచలన నిర్ణయం ఈ పరిస్థితికి దారితీసింది.
అసలు అమెరికా ప్రభుత్వం ఏం చేసిందంటే.. అమెరికాలోని స్వతంత్ర కళాశాలలు, పాఠశాలలకు జాతీయస్థాయి సంస్థ అయిన అక్రిడిటింగ్ కౌన్సిల్ ఫర్ ఇండిపెండెంట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ (ఏసీఐసీఎస్) గుర్తింపు ఇస్తూంటుంది. కాగా, డిసెంబర్ నెలలో అమెరికా విద్యా శాఖ ఏసీఐసీఎస్ గుర్తింపునే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, రద్దు నిర్ణయం తర్వాత విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గం చూపకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
భారత టెక్కీలకు షాక్: చట్టరూపం దాల్చనున్న హెచ్1బి వీసా బిల్లు
ఈ నిర్ణయం స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం (ఎస్ఈవీపీ) కింద ఏసీఐసీఎస్ గుర్తింపునిచ్చిన 130 కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్న సుమారు 16 వేల మంది అంతర్జాతీయ విద్యార్థులపై ప్రభావం చూపుతుందని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ స్వయంగా వెల్లడించడం గమనార్హం. కాగా, బాధితుల్లో ఎక్కువమంది భారత సంతతి విద్యార్థులు కాగా, వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది.
గుర్తింపు ఎందుకు రద్దు చేశారంటే..?
1912లో ఏసీఐసీఎస్ను ఏర్పాటు చేశారు. సాంకేతిక, వృత్తి విద్యా కళాశాలలకు ఆ జాతీయ మండలి ఇచ్చే గుర్తింపు తప్పనిసరి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 245 విద్యా సంస్థలను ఏసీఐసీఎస్ పర్యవేక్షిస్తోంది. వాటిలో చాలావరకు లాభాపేక్షతో పనిచేస్తున్నవే. వీటిలో సుమారు 60,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా, నిరుడు ప్రభుత్వ సహాయం కింద సుమారు 4.76 బిలియన్ డాలర్లు ఆయా సంస్థలకు అందాయి.
ఏసీఐసీఎస్పై పనితీరులో లోపాల నేపథ్యంలో ఉన్నతస్థాయి బృందం లోతైన దర్యాప్తు చేపట్టింది. బోగస్, ప్రమాణాలు లేని కళాశాలకు సైతం గుర్తింపు ఇచ్చిందని దర్యాప్తు బృందం తన నివేదికలో పేర్కొంది. విద్యార్థులు, పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలకు కాపాడలేకపోయిందని అభిశంసించింది. దీంతో విద్యా శాఖ.. ఏసీఐసీఎస్ గుర్తింపు రద్దు చేసింది. కాగా, ఇటీవల ఏసీఐసీఎస్ గుర్తింపునిచ్చిన రెండు కళాశాలలు మూతపడడం గమనార్హం.
విద్యార్థుల భవిష్యత్ ఏమవుతుందో..?
ఏసీఐసీఎస్ ద్వారా గుర్తింపు పొందిన కళాశాలలకు అమెరికా విద్యా శాఖ 18 నెలల గడువు ఇచ్చింది. ప్రభుత్వ నిధులు పొందాలంటే ఈలోగా కొత్తగా గుర్తింపు పొందవలసి ఉంటుంది. చాలా విద్యా సంస్థలు అక్రిడిటింగ్ కమిషన్ ఆఫ్ కెరీర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ (ఏసీసీఎస్సీ)ను ఆశ్రయిస్తున్నాయి.
అలాగే ప్రభుత్వం విధించిన కొత్త షరతులకు ఆయా విద్యాసంస్థలు అంగీకరించాల్సి ఉంటుంది. అయితే 24 నెలల వ్యవధి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్ (ఎస్టీఈఎం) ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రయినింగ్ (ఓపీటీ) కోసం దరఖాస్తు చేసుకున్న ఎఫ్-1 స్టూడెంట్స్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
యూనివర్సిటీతో సంప్రదింపులు
అమెరికాలో ఆంధ్రపదేశ్ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, అక్కడి తెలుగు సంఘం తానా కార్యవర్గ ప్రతినిధులు న్యాయ నిపుణులను, విద్యాసంస్థల వారిని సంప్రదిస్తున్నారు. నార్త్వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ అధికారులను కలిసి విద్యార్థులకు ఉన్న ప్రత్యమ్నాయ మార్గాలపై చర్చించారు. ఇతర పాఠశాలలకు వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు కొంతయినా ఫీజు వాపసు ఇప్పించేందుకు కృషి చేస్తున్నారు.
ఓపీటీ(ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్), ఓపీటీ ఎక్స్టెన్షన్ విద్యార్థుల భవిష్యత్తు, కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ అయి ఏప్రిల్లో హెచ్ 1 ఫైలింగ్కు సిద్ధమయ్యే విద్యార్థుల భవిష్యత్తు పైనా న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. కాగా, ఈ అంశంపై మరింత సమాచారం, సలహాల కోసం ICE.gov/SEVP అనే సైట్ను సందర్శించాలని హోమ్లాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ సూచించింది. కాగా, అమెరికాకు చెందిన గురుకుల్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సీఈఓ విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. ఏసీఐసీఎస్ రద్దు నేపథ్యంలో విద్యార్థులు ఓటిపి ఎక్స్టెన్షన్ ద్వారా ప్రత్యామ్నాయ కోర్సుల్లో అక్రిడేషన్ ఉన్న కాలేజీల్లో చేరవచ్చని తెలిపారు.