కెసిఆర్ నన్నొద్దనుకున్నారు, జగన్ వస్తే ఓకే: రాధాకృష్ణ
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నష్టం జరిగిందని, విభజనతో ఆంధ్రప్రదేశ్కు కష్టం వచ్చిందని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. డెట్రాయిట్లో తానా ఉత్సవాల్లో భాగంగా ఓపెన్ హార్ట్ విత్ యూ కార్యక్రమంలో పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.
పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతూ... ఫిరాయింపుల కోసం చట్టం ఉందని కానీ, అది సరిగ్గా అమలు కావడం లేదన్నారు. ఇందులో ప్రజల బాధ్యత కూడా ఉంటుందన్నారు. జనాలు కూడా అలాంటి వారికి దండలు వేస్తున్నారన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు మంత్రిగా ఉండటంపై వారే సమాధానం చెప్పాలన్నారు.
చంద్రబాబు సీఎం అయినా నిధులు లేక ఏం చేయలేకపోతున్నారని, ఆయనకు మద్దతుగా తాము ఏం చేయగలమని ప్రశ్నించారు. దానికి రాధాకృష్ణ.. ఆయన తిప్పలు ఆయన పడతారని, ఐదేళ్ల తర్వాత చేయకుంటే ప్రజలు ఆయననే దింపేస్తారన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకు పిలుస్తున్నా రావడం లేదని చెప్పారు. మీరు పిలిపిస్తే రేపే చేస్తానని చెప్పారు. మీడియా వివక్షపై స్పందిస్తూ.. కెసిఆర్ నమస్తే తెలంగాణ, జగన్ సాక్షితో ఆంధ్రజ్యోతిని పోల్చవద్దని చెప్పారు.
ఇద్దరు రాజకీయ నేతలు పత్రికలు పెట్టుకున్నంత మాత్రాన మీడియా పాడైపోయిందనవద్దన్నారు. జనాలను చైతన్యపరచాలన్నారు. తనకు పెద్దగా ఆస్తులు లేవని, అందుకే స్థైర్యంతో ఉండగలుగుతున్నానని చెప్పారు.
తనతో కెసిఆరే స్నేహం వద్దనుకున్నారని చెప్పారు. ఏబీఎన్ నిషేధం పైన న్యాయవ్యవస్థ ద్వారా పోరాడుతున్నామని చెప్పారు.
ఈ విషయం సుప్రీం కోర్టు పరిధిలో ఉందన్నారు. కోర్టుది తుది నిర్ణయం అన్నారు. అంతేకానీ కెసిఆర్ వద్దకెళ్లి బతిమాలనని చెప్పారు. కెసిఆర్ పైన విమర్శలు చేస్తున్నందుకు తనను తెలంగాణ ద్రోహి అనే ముద్ర వేశారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ డౌన్ అయినప్పుడు మీడియా ఉద్యమానికి అండగా నిలిచిందన్నారు.