తొలిసారి రైతుకు 'పద్మ': రాజమౌళికి కర్నాటక నుంచి..
న్యూఢిల్లీ: పద్మ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం నాడు అభినందనలు తెలిపారు. చరిత్రలో తొలిసారిగా ఓ రైతుకు పద్మ పురస్కారం దక్కడం ఆనందం కలిగిస్తోందంటూ వెంకయ్య హర్షం వ్యక్తం చేశారు. పద్మ పురస్కారం దక్కించుకున్న ఆ రైతు పేరు సుభాష్ పాలేకర్.
వెంకయ్య ఆ రైతు సుభాష్ పాలేకర్ను అభినందించారు. సోమవారం నాడు కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. 10 పద్మవిభూషణ్లు, 19 పద్మభూషణ్లు, 83 పద్మశ్రీలు ప్రకటించింది. ఇందులో ఓ రైతుకు తొలిసారి పద్మశ్రీ దక్కింది. దీనిపై వెంకయ్య హర్షం వ్యక్తం చేశారు.
తెలుగు వ్యక్తులు పద్నాలుగు మంది పద్మ పురస్కారాలకు ఎంపికవడం ఆనందకరమని వెంకయ్య అన్నారు. పత్రికా రంగంలో ఉన్నత ప్రమాణాలు నిలబెడుతూ, సామాజిక చైతన్యం కలిగిస్తూ, తెలుగు భాషా పరిరక్షణ కోసం విశేష కృషి చేస్తూ, పత్రికా రంగానికి విశిష్ట సేవలందించి, ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రామోజీరావుకు పద్మవిభూషణ్ పురస్కారం దక్కటం సంతోషకరమన్నారు.
తెలుగు ప్రముఖులైన ప్రఖ్యాత నృత్యకళాకారిణి యామినీ కృష్ణమూర్తికి పద్మవిభూషణ్ లభించడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు.
సాహితీరంగంలో బహుముఖ ప్రతిభ కనబరిచిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వైద్యరంగంలో అంకితభావంతో సేవలు అందించిన డా.నాగేశ్వర రెడ్డి, శాస్త్రీయరంగంలో విశేష కృషి చేసిన వెంకట రామారావు, క్రీడారంగంలో ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన సానియా మీర్జా, సైనా నెహ్వాల్లను పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించడం సంతోషమన్నారు.
వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి పద్మశ్రీ గుర్తింపు పొందిన తెలుగు ప్రముఖులు టివి నారాయణ, డా.గోపీచంద్, ఆర్టిస్ట్ లక్ష్మాగౌడ్, డా.ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, యార్లగడ్డ నాయుడమ్మ, సునీతాకృష్ణన్, ఎస్ఎస్ రాజమౌళి తెలుగు వెలుగుల్ని వ్యాపింపజేయడం స్ఫూర్తిదాయకమన్నారు.
కాగా, రాజమౌళికి కర్నాటక కేటగిరి నుంచి అవార్డు దక్కింది. రాజమౌళి కర్నాటకలోని రాయచూర్లో జన్మించారు. రాజమౌళి ఏలూరులో చదివారు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ సినిమా రంగంలో ఉన్నారు. రాజమౌళి తెలుగులో విజయవంత దర్శకుడిగా దూసుకుపోతున్నాడు. ఇటీవలే బాహుబలి సినిమాతో తెలుగు సినిమా, భారతీయ సినిమాను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లారు.