వెంకయ్య సంచలనం: కెసిఆర్, బాబులకు నైతిక చిక్కులు
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు, ఆయన ఆచరణ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్పీకర్లకు సంకటంగా మారాయి. తెలంగాణలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి ఫిరాయించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. ఇరు రాష్ట్రాల్లో ఇతరర పార్టీల నుంచి వచ్చిన కొంత మంది శాసనసభ్యులు మంత్రి పదవులు కూడా అనుభవిస్తున్నారు.
ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన శాసనసభ్యులపై ఇరు రాష్ట్రాల స్పీకర్లు కూడా ఏ విదమైన చర్యలు తీసుకోవడం లేదు. ఈ స్థితిలో వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
ఫిరాయింపులపై వెంకయ్య ఏమన్నారు..
సభ్యుల అనర్హతపై నిర్ణయం ఆలస్యమైతే ఫిరాయింపు నిరోధక చట్టం లక్ష్యాన్ని దెబ్బతీసినట్లేనని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. అనర్హతపై అందిన ఫిర్యాదులను అసెంబ్లీ ప్రిసైడింగ్ అధికారులు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీ ఫిరాయింపుల చట్టం అమలుపై ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాసనసభల స్పీకర్లకు నైతిక చిక్కులను కల్పిస్తున్నాయి.
శరద్ యాదవ్పై అనర్హత వేటు...
రాజ్యసభ సభ్యులు జనతాదళ్ (యు) నేత శరద్యాదవ్, అలీ అన్వర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు అందిన నెలలోపే రాజ్యసభ చైర్మన్ కూడా వెంకయ్యనాయుడు విచారించి, సభాహక్కుల సంఘానికి కూడా పంపకుండా వారిద్దరిపై అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనానికి కారణమైంది.
ఈ కారణంగా వేటు వేశారు...
ఒక పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు తమ పార్టీ నిర్ణయంపై బహిరంగంగా విమర్శలు చేసినా, వేరే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా అనర్హులేనని పదో షెడ్యూల్ నిబంధన చెబుతోంది. దాని ప్రకారం వారిద్దరిపై వెంకయ్య నాయుడు వేటు వేశారు. శరద్యాదవ్ మరొక పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన ప్రత్యర్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై వేటు పడింది.
వెంకయ్య చర్యలతో జగన్కు జోష్
వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు, ఇద్దరు ఎంపీలపై ఆయన తీసుకున్న నిర్ణయం చంద్రబాబు, కెసిఆర్ల నైతిక విలువలను ప్రశ్నించే విధంగా ఉండగా, ఇరు రాష్ట్రాల స్పీకర్ల నైతికతను ప్రశ్నించినట్లయింది. ఇది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్యక్షుడికి ఆనందాన్ని ఇచ్చే విషయమే. తెలంగాణ కాంగ్రెసుకు కూడా నైతిక బలాన్ని ఇచ్చినట్లయింది.
ఇరు రాష్ట్రాల్లో ఫిరాయింపులు ఇలా...
వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, టిడిపి, సిపిఐల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22 మంది, తెలంగాణలో 20 మంది శాసనసభ్యులు అధికార పార్టీల్లోకి ఫిరాయించారు. వారిలో తెలంగాణలో తెలుగుదేశం నుంచి తెరాసలో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన భూమా అఖిలప్రియ మంత్రి పదవులు అనుభవిస్తున్నారు.
ఫిర్యాదులు చేసినా కూడా...
పార్టీ మారిన తమ సభ్యులపై అనర్హత వేటు వేయాలని, రెండు రాష్ట్రాల ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేసి ఏడాదికి పైగానే అయింది. ఆ విషయాన్ని గవర్నర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్లాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇరు రాష్ట్రాల స్పీకర్లు కూడా ఏ విధమైన చర్యలూ తీసుకోవడం లేదు. దాంతో పార్టీ ఫిరాయింపుల చట్టం స్ఫూర్తి దెబ్బ తింటోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కెసిఆర్, బాబులకు చిక్కులు...
ఇతర పార్టీల శాసనసభ్యులకు ఎర వేసి తమ పార్టీల్లోకి వారిని లాక్కుంటున్నారనే విమర్సలను చంద్రబాబు, కెసిఆర్ ఎదుర్కుంటున్నారు. వీరిద్దరి రాజకీయాల కారణంగానే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఉండడం లేదని ప్రతిపక్షాలు విమర్సిస్తున్నాయి. వెంకయ్య నాయుడి తాజా వ్యాఖ్యలు వారిద్దరిని రాజకీయంగా చిక్కుల్లో పడేసినట్లు భావిస్తున్నారు.