అమ్మాయిని చుంబిస్తూ అంబరీష్ వీడియో
బెంగళూరు: శాసనసభలో బిజెపి సభ్యుడు ప్రభు చవాన్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ చిత్రాన్ని జూమ్ చేస్తూ శాసనసభలో కనిపించడంపై చెలరేగుతున్న వివాదం గృహ నిర్మాణ శాఖ మంత్రి, సినీ నటుడు అంబరీష్ వీడియో వైపు మళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. అంబరీష్ ఓ అమ్మాయిని చుంబిస్తున్న చిత్రం వాట్సప్లో సర్క్యులేట్ కావడంపై వివాదం చెలరేగుతోంది. అయితే, ఆ చిత్రం నిజమైందా, కాదా అనేది తెలియడం లేదు. అంబరీష్ మాత్రం ఆ విషయంపై సూటిగా స్పందించలేదు.
దానికి తోడు మంత్రి అంబరీష్ సెల్లో తన నృత్యాలకు సంబంధించిన ఫొటోలు చూస్తూ బుధవారం సభలో కాలక్షేపం చేశారనే ఆరోపణలు కూడా బుధవారంనాడు వచ్చాయి. దీంతో మూడవ రోజైన గురువారం కూడా శాసనసభలో మొబైల్ వివాదం ఊపేసింది. మొదటిరోజు చెరుకు మద్దతు ధరపై చర్చ జరగుతుండగా ప్రభు చవాన్ సెల్లో ఫోటోలూ చూస్తూ కాలం గడిపారంటూ వచ్చిన ఆరోపణలతో గురువారం మధ్యాహ్నం నుంచి వివాదం ప్రారంభమైంది.
గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ బుధవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో ఒక వైపు చర్చ జరుగుతుంటే మరోవైపు తన పక్కన ఉన్న తమ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే మల్లికార్జునకు గతంలో తాను ఓ పబ్లో తాను చేసిన నాట్యాన్ని సెల్ఫోన్లో చూపిస్తూ కాలం గడిపారని ఆరోపణలు వచ్చాయి. అంబరీష్ సెల్ ఫోన్ పట్టుకున్న దృశ్యాలను టీవీ చానెళ్లు చూపించాయి గానీ ఆయన సెల్లో ఏం చూశారనే విషయాన్ని స్పష్టంగా చూపలేకపోయాయి. అయితే, ఆయన ఏం చూశారనేది ఇప్పటికీ ఏమీ తెలియదు.
శాసనసభలో మూడో రోజైన గురువారం సభా కార్యక్రమాలు మొదలైన వెంటనే కాంగ్రెస్ పార్టీకు చెందిన పలువురు నాయకులు ‘బీజేపీ షేమ్...షేమ్' అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. సభలో మొబైల్లో ప్రియాంకగాంధీని ఫొటోను జూమ్ చేసి చూసిన ప్రభు చౌహాన్ను ఒక రోజు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రతిస్పందించిన బీజేపీ నాయకులు ‘చేసిన తప్పునకు చౌహాన్ క్షమాపణ స్పీకర్కు ఇప్పటికే క్షమాపణ చెప్పారని, సభలో కూడా చెప్పడానికి సిద్ధం.
ఇంతటితో ఈ విషయాన్ని వదిలేద్దామని అన్నారు. అలా కాదు అంటే మీ పార్టీకు చెందిన మంత్రి అంబరీష్, మల్లికార్జునలను కూడా ఒక రోజు సస్పెండ్ చేయాలని అన్నారు. ఇందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. దీంతో శాసనసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సభను సజావుగా జరిపే పరిస్థితి కనిపించ పోవడంతో సభను కొద్ది సేపు వాయిదా వేశారు. అధికార, ప్రతిపక్షానికి చెందిన నాయకులతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప తన కార్యలయంలో కొద్ది సేపు సమావేశమయ్యారు. ఇరు పార్టీల మధ్య సంధానానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శాసనమండలిలో కూడా అదే గొడవ జరిగింది.
కాగా, అంబరీష్ తనపై వచ్చిన ఆరోపణలను తేలికగా కొట్టిపారేశారు. రాహుల్ గాంధీకి చెప్పుకుంటే చెప్పుకోనీయండి, అదంతా తాను సభలో చేయలేదని, అధి తన వ్యక్తిగత విషయమని ఆయన అన్నారు. వాట్పప్లో హల్ చల్ చేస్తున్న అంబరీష్ చిత్రం ఇటీవల బెంగళూరులోని ఓ బార్లోతీసినవని కొందరు, చాలా నెలల క్రితం ఆయన సొంత జిల్లా మాండ్యాలోని ఓ బార్లో తీసినవని మరికొందరు వాదిస్తున్నారు.
బుధవారంనాడు అంబరీష్ సభలో సెల్ఫోన్ తిలకించడం నిజమైతే తాను ఖండిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. అంబరీష్ ఎక్కడ చూశాడు, ఏం చూశాడు అని ఆయన అడిగారు. అంబరీష్ అలా చేసి ఉంటే మరోసారి అలా చేయవద్దని సలహా ఇస్తానని చెప్పారు.
అంబరీష్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. అంబరీష్కు బార్లకు వెళ్లడానికి సమయం ఉంది గానీ మంత్రి వర్గ సమావేశాలకు హాజరు కావడానికి సమయం లేదంటూ కొంత మంది కాంగ్రెసు కార్యకర్తలు కర్ణాటక కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. బోర్డులు, కార్పోరేషన్ల అధిపతుల నియామకంపై అంబరీష్ ఇటీవల బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సిద్ధరామయ్యను ఇరకాటంలో పెట్టింది.