చిరు సినిమాకు రాములమ్మ నో: ఉడ్తా పంజాబ్లా...
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో తెలంగా రాములమ్మ నటిస్తారనేది ఉత్త ప్రచారం మాత్రమేనని అంటున్నారు. విజయశాంతి ఆ సినిమాలో నటించడానికి సుముఖంగా లేరని చెబుతున్నారు. ఆమె ఆలోచనలు మరో దిశగా సాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఓ వైపు తెలంగాణ పిసిసి అధ్యక్షురాలిగా అధిష్టానం ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఉడ్తా పంజాబ్ లాంటి సినిమా చేయాలని ఆమె ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవితో జతకట్టిన విజయశాంతి 150వ సినిమాలో నటిస్తారని ప్రచారం సాగింది. అయితే, ఈ విషయంపై విజయశాంతి స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. చిరంజీవి 150వ సినిమాలో నటించాలని ఎవరూ తనను అడగలేదని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఆమె మనసులో ఉన్న మాటను వెల్లడించారు.
హైదరాబాద్ మత్తు పదార్థాలు సేవించిన యువకుల చేతిలో రమ్య అనే చిన్నారి అకారణంగా బలి కావడం తెలంగాణ రాములమ్మను తీవ్రంగా కలిచి వేసిందని చెబుతున్నారు. ఇటువంటి సంఘటనలు ఆమె మనసును బాధపెడుతున్నట్లు సమాచారం.
హైదరాబాద్ ప్రస్తుతం డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకుందని, పబ్స్, క్లబ్స్ ఇలా ప్రతి ప్రదేశం డ్రగ్స్ అడ్డాగా మారిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మత్తులో చతికిలబడినవారిని బయటకు తీసుకెళ్లడానికి స్టెచర్లు, వీల్ చైర్స్ని కూడా పబ్స్లో ఏర్పాటు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన మాదిరిగానే హైదరాబాదును డ్రగ్స్ నుంచి విముక్తం చేసేందుకు నడుం బిగిస్తానని విజయశాంతి చెప్పారు. పంజాబ్లో డ్రగ్స్ వాడకాన్ని నిరసిస్తూ 'ఉడ్తా పంజాబ్' అనే సందేశాత్మక సినిమాని నిర్మించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి ఉడ్తా పంజాబ్ వంటి సినిమా తీసి తాను అందులో లీడ్ రోల్ చేయాలని ఆమె అనుకుంటున్నారు.