పుష్కరాల్లో 'బాహుబలి' రైటర్ను తిట్టారట!
హైదరాబాద్: బాహుబలి సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే. అయితే, బాహుబలి సినిమా కథ రచయితను ఓ కుటుంబానికి చెందినవారు తిట్టారట. ఈ విషయాన్ని కథ రచయిత కోడూరి విజయేంద్ర ప్రసాద్ స్వయంగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు. ఆయన ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోదావరి పుష్కరాల్లో స్నానమాచరించడానికి ఆయన వెళ్లారు.
గోదావరి పుష్కరాలకు తాను వెళ్లినప్పుడు ఓ కుటుంబానికి చెందినవారు బాహుబలి కథా రచయితను తిట్టడం తాను విన్నానని విజయేంద్ర ప్రసాద్ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధితో చెప్పారు. అయితే, ఆ కథ రాసింది తానేనని ఆయన చెప్పుకోలేదట, అలా తిట్టడానికి కారణం ఉంది.
బాహుబలి సినిమాను రెండో భాగం కోసం సస్పెన్తో ముగించడమే అలా తిట్టడానికి కారణమని 72 ఏళ్ల విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. రాజుకు రక్షణగా నిలువాల్సిన కట్టప్ప అనే వ్యక్తి అమరేంద్ర బాహుబలిని చంపడంతో మొదటి భాగం ముగిసింది. దీంతో ఆ తర్వాతి కథపై తీవ్రమైన ఉత్కంఠను కలిగిస్తోంది. ఆ ఉత్కంఠ రెండో భాగాన్ని చూడడానికి పురికొల్పుతోంది. రెండో భాగం ఎప్పుడు విడుదలవుతుందా అనే ఎదురు చూసేలా చాలా తెలివిగా మొదటి భాగాన్ని ముగించారు.
ఆ తిట్టు తనకు ప్రశంస అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. బాహుబలికి వచ్చినంత ఖ్యాతి తనకు ఇంతకు ముందు రాలేదని కూడా అన్నారు. ఆ క్రెడిట్ అంతా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిదేనని ఆయన అన్నారు విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి తండ్రి అనే విషయం అందరికీ తెలిసిందే.
కాగా, విజయేంద్ర ప్రసాద్కు మరో సంతోషకరమైన సంఘటన కూడా జరిగింది. సల్మాన్ నటించిన భజరంగ్ బైజాన్ కథను కూడా ఆయనే రాశారు. బాహుబలి, భజరంగ్ భైజాన్ కలిసి 450 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టాయి. భజరంగ్ బైజాన్ సినిమా ఉద్వేగానికి సంబంధించింది కాగా, బాహుబలి హింసతో కూడింది.
హైదరాబాదులోని మణికొండ గల తన నివాసంలో కూర్చుని విజయేంద్ర ప్రసాద్ ఆ రెండు కథలూ రాశారు. ఇటీవలి కాలంలో ఇంతగా విజయం సాధించిన సినిమాలు మరేవీ లేవు. విజయేంద్ర ప్రసాద్కు ఇది గర్వకారణమే.