అనుష్క గురించి జర్నలిస్ట్ కొంటె ప్రశ్న: కోహ్లీ ఆగ్రహం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కోపమొచ్చింది. మైదానంలో కోహ్లీ దూకుడుగా ఉంటాడనే విషయం తెలిసిందే. అయితే, తాజాగా విలేకరుల పైన ఆయన మండిపడ్డాడు. అందుకు తన ప్రియురాలు అనుష్క శర్మ గురించి ప్రశ్నించడమే కారణం.
కోహ్లి - అనుష్క శర్మ మధ్య బంధానికి తెరపడిందంటూ ఇటీవల వార్తలు వచ్చిన తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోహ్లీ ఎక్కడికి వెళ్లినా అతడికి అనుష్కకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి.
మంగళవారం జరిగిన ప్రయివేటు కార్యక్రమంలో ఓ ఖరీదైన గడియారాన్ని బాలీవుడ్లో ఎవరికైనా బహూకరించాల్సి వస్తే ఎవరికి ఇస్తారని ఓ విలేకరి ప్రశ్నించాడు. దానికి విరాట్ కోహ్లీ మాత్రం కాస్త ఘాటుగానే స్పందించాడు.
బాలీవుడ్లో ఉన్నవాళ్లకు ఎందుకిస్తానని, ఇస్తేగిస్తే తన కుటుంబంలో ఎవరికైనా బహుమానంగా ఇస్తానని, లేకుంటే జట్టు సహచరులకు ఇస్తానని, అయినా ఎవరికిస్తే మీకెందుకని మండిపడ్డాడు. ప్రస్తుత కార్యక్రమానికి సంబంధించిన ప్రశ్నలడగాలి కానీ విషయాన్ని మరోవైపు మళ్లించే ప్రయత్నం ఎందుకు చేస్తారన్నాడు.
మానవ సంబంధాల (రిలేషన్షిప్) గురించి అడిగిన మరో ప్రశ్నకూ కోహ్లీ ఘాటుగానే స్పందించాడు. ఎవరితో సంబంధం గురించి అడుగుతున్నారని, అయినా ఇవి నన్నడగాల్సిన ప్రశ్నలు కాదని వ్యాఖ్యానించాడు. తాను ఎవరితోను రిలేషన్షిప్లో లేనని చెప్పాడు.