మోడీకి దక్షిణాది సెగ: కేసిఆర్, బాబు ఇప్పటికే, తాజాగా సిద్ధూ
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దక్షిణాది రాష్ట్రాల ఎజెండాను ముందుకు తెచ్చారు. మనం మోడీని ప్రతిఘటించాలని ఆయన దక్షిణాది రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ని నిధులు ఇవ్వాలనే విషయాన్ని 2011 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించాలని మోడీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి సూచించింది. దీనికి సిద్ధరామయ్య అభ్యంతరం తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు 1971 జనాభా లెక్కలను అందుకు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.
పన్నుల పంపిణీకి ఇదీ ప్రాతిపదిక
పన్నుల సంక్రమణకు 1971 జనాభా లెక్కలను కాకుండా 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం 15వ ఆర్థిక సంఘానికి సిఫార్సు చేసిందని, దీనివల్ల దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందని, దాన్ని మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని సిద్దరామయ్య ట్విట్టర్లో అన్నారు.
వాటిని ఇలా ట్యాగ్ చేశారు...
తన ట్విట్టర్ హ్యాండిల్స్నను ఆరుగురు ముఖ్్యమంత్రులకు ట్యాగ్ చేసి తన అభిప్రాయాన్ని పోస్టు చేశారు. డిఎంకె నేత ఎంకె స్టాలిన్ను, కాంగ్రెసు నేత శశిథరూర్ను కూడా ట్యాగ్ చేశారు.
ఎందుకు నష్టం...
ఆర్థిక సంఘానికి కేంద్రం చేసిన సిఫార్సును దక్షిణాది నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఉత్తరాది కన్నా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలు చేశాయి జానాభా పెరుగుదల ఉత్తరాది రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ నిధులు వస్తాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల నాయకులు కేంద్రం సిఫార్సను వ్యతిరేకిస్తున్నారు.
ఇప్పటికే కేసిఆర్, చంద్రబాబు
కేంద్ర నిధుల పంపిణీలో అన్యాయం జరుగుతోందని దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తమ రాష్ట్రాల నుంచి కేంద్రం ఎక్కువగా తీసుకుని తమకు తక్కువగా ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
స్టాలిన్ ఇలా రాశాడు..
ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుండగా తాజా ప్రతిపాదన మరింత అన్యాయానికి దారి తీస్తుందని భావిస్తున్నారు. డిఎంకె నేత స్టాలిన్ రెండు లేఖలు రాశారు. ఒక్కటి ప్రధాని మోడీకి, మరోటి పది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు. తాజా ప్రతిపాదనపై ఆయన ఈ లేఖలు రాశారు. భారతదేశం నుంచి విడిపోవడానికి దక్షిణాది రాష్ట్రాలు చేసే ఏ ప్రయత్నానికైనా తన మద్దతు ఉంటుందని అంతకు ముందు ఆయన అన్నారు.