పెద్ద ప్రశ్నే: రూ. 500, 1000 నోట్లను ఆర్బీఐ ఏం చేస్తుంది?
న్యూఢిల్లీ: కేంద్రం ఇచ్చిన గడువు శుక్రవారంతో తీరిపోనుంది. దీంతో శనివారం నుంచి రూ. 500, 1000 నోట్ల పూర్తిగా చెల్లని నోట్లుగా మారిపోతాయి. అయితే, చాలా మందికి ఇంత భారీ మొత్తంలో చెల్లని నోట్లుగా మారే రూ. 500, 1000 నోట్లను ఆర్బీఐ ఏం చేస్తుందనే సందేహం ఉంది.
గురువారం ఉదయం నుంచే బ్యాంకులు రూ. 500, 1000 నోట్లను ప్రజల నుంచి సేకరించి వారికి కొత్త నోట్లు లేదా, రూ. 100 నోట్లు ఇచ్చేయడం మొదలుపెట్టాయి. ఈ ప్రక్రియ గురువారం, శుక్రవారం జరగనుంది. శనివారం నుంచి ఈ నోట్లు పూర్తిగా చెలామణి నుంచి తొలగించబడతాయి. అయితే, డిసెంబర్ 30 వరకు కూడా ఈ పాత పెద్దనోట్లను బ్యాంకులలో మార్పిడి చేసుకోవచ్చు.
ఈ పాత నోట్లన్నీ సేకరించిన తర్వాత వాటన్నింటినీ పూర్తిగా నాశనం చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ నోట్లను ఉపయోగించి వేరే నోట్లను తయారు చేయడం జరగదు. దేశ వ్యాప్తంగా బ్యాంకుల నుంచి ట్రక్కుల ద్వారా వచ్చిన పెద్ద నోట్లను ముక్కలు ముక్కలుగా కత్తిరించి పూర్తిగా నాశనం చేస్తుంది ఆర్బీఐ.
ఆ తర్వాత వాటికి తేమ అందించి దిమ్మెలుగా తయారు చేస్తుంది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్కు ఇచ్చేయడం జరుగుతుంది. దీన్ని ఆ కాంట్రాక్టర్ ల్యాండ్ ఫిల్లింగ్ కోసం ఉపయోగిస్తారు.
అయితే, ఈ ప్రక్రియ ఆర్బీఐ ఒక్కసారిగా పూర్తి చేయలేదు. దశదశలుగా కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా బ్యాంకుల నుంచి వచ్చే కరెన్సీ నోట్లను ఎప్పటికప్పుడు ఈ విధంగా ప్రాసెస్ చేస్తుంది. కాగా, మార్చి 2016 నాటికే 15,707 మిలియన్ల రూ. 500 నోట్లు, 6,326 మిలియన్ల రూ. 1000 నోట్లు అమలులో ఉన్నాయి.