ఇదీ చిన్నమ్మ: శశికళ గురించి కొన్ని ఆసక్తికర నిజాలు..!
చెన్నై: తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకునే తీర్మానాన్ని సీఎం పన్నీర్ సెల్వంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా మొత్తం 23 మంది కలిసి ప్రతిపాదించారు.
ఈ తీర్మానాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్టీ సర్వసభ్య సమావేశం ఆమోదించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా నలుగురు మంత్రులు పోయెస్ గార్డెన్కు చేరుకుని శశికళకు అందించారు. ఈ నేపథ్యంలో శశికళ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు...
జయలలిత నిర్ణయాల వెనుక...
ఇప్పుడు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయిన శశికళ.. జయలలిత ఉన్నప్పుడు కూడా ఆమె తీసుకున్న పలు నిర్ణయాల వెనుక ఈమె హస్తం ఉండేదని అంటున్నారు. జయ ఆసుపత్రిలో ఉన్నప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని అదుపులో పెట్టుకున్నారు. జయ ఫోటో బయటకు రాకుండా కూడా ఆమెనే చేశారనే వాదనలు ఉన్నాయి.
పన్నీరు సెల్వం పేరుకే..
ప్రస్తుతం పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి. అయితే ఆయన పేరుకే అంటున్నారు. నిర్ణయాధికారాలన్నీ ఆమె చేతిలోనే ఉంటాయని అంటున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు, మంత్రులు.. ఇలా అందరూ ఆమె చేతిలోనే ఉన్నారని అంటున్నారు.
వీడియో పార్లర్ నడిపిన శశికళ
శశికళ చెన్నైలో వీడియో పార్లర్ నడిపేవారు. ముఖ్యమైన ప్రోగ్రాంలకు తనే వీడియో రికార్డర్ పట్టుకొని వెళ్లేవారు. ఆ స్థితి నుంచి ఈ రోజు అన్నాడీఎంకే పార్టీ చీఫ్గా అయ్యారు.
కేసులు
జయలలిత అక్రమాస్తుల కేసుకు సంబంధించి 2014లో ఆమెకు కూడా శిక్ష పడింది. రూ.పది కోట్లు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో తాన్సీ భూముల ఆక్రమణలోను ఆమెకు శిక్షపడింది. ఆ కేసు ఓ సంచలనం. అందులో జయలలిత ప్రధాన నిందితురాలు. జయ ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా మారినా.. ఆమె పార్టీ గెలవగానే అప్పటి గవర్నర్ ఫాతమా... అమ్మతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తప్పుకు ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జయ దిగిపోయారు.
జయలలితతో దశాబ్దాల పాటు ఉన్న శశికళ ఏ రోజు కూడా ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించింది లేదు. అలాంటిది ఇప్పుడు ఆమె ఏకంగా పార్టీని నడిపించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ పగ్గాలు కూడా ఆమె పరం కానున్నాయని అంటున్నారు.
ఇప్పటి వరకు ఆమె గొంతు వినని తమిళ ప్రజలు!
శశికళ ఇప్పటి వరకు బహిరంగ వేదికల పైన మాట్లాడింది లేదు. ఇప్పుడు ఆమె ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆమె గొంతు ఇకముందు వినిపించనుంది.
సమాంతర ప్రభుత్వం
జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శశికళ, ఆమె కుటుంబం సమాంతర ప్రభుత్వాన్ని నడిపేవని అంటారు. దానినే మన్నార్ గుడి మాఫియా అంటారు. పన్నీరు సెల్వం, శశికళ దేవర్ కులానికి చెందిన వారు. తమిళనాట ఈ వర్గానికి పలుకుబడి. జయ మృతి అనంతరం 130 మంది ఎమ్మెల్యేలు, 48 మంది ఎంపీలు, పార్టీ పదవుల్లో ఉన్న వారు శశికళను కలిశారు.