రోహిత్ ఆత్మహత్య: స్కూల్ టీచర్లా స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సియు) దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేతులు కడిగేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించారు. ఆమె బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆగ్రహంతో అట్టుడుకుతున్న స్కూల్ టీచర్లా కనిపించారు.
అంతేగానీ, విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించినట్లు కనిపించలేదు.రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో తన శాఖ తీరుపై విమర్శలు రావడంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు కనిపించారే తప్ప అసలు సమస్య ఏమిటి, ఏం జరిగిందనే విషయంపై పెద్దగా పట్టించుకున్నట్లు లేరు.
రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆందోళనకారులు స్మృతి ఇరానీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆమె ఎదుర్కోవడానికి అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని మీడియా సమావేశానికి వచ్చినట్లు కనిపించారు. కాగా, తాను చెప్పదలుచుకున్న విషయం చెప్పేసి, ఒకటి రెండు ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేస్తున్నప్పటికీ ఆమె లేచి వెళ్లిపోయారు.
హెచ్సియును సందర్శిస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగితే లేదని సమాధానం చెప్పారు. తాను వెళ్తే జోక్యం చేసుకున్నారనే విమర్శలు వస్తాయని తప్పించుకున్నారు. విద్యార్థుల మేలు కన్నా ఆత్మరక్షణ, ప్రభుత్వ ప్రతిష్ట మాత్రమే ఆమెకు పట్టినట్లు అర్థమవుతోంది.
ఉన్నత విద్యా సంస్థల్లో దళితుల పట్ల వివక్ష కొనసాగుతుందనే ఆరోపణలపై ఆమె స్పందించలేదు. రోహిత్ ఆత్మహత్యపై ఆందోళనకు దిగుతున్న విద్యార్థులను చల్లార్చడానికి ప్రయత్నించకపోగా అగ్నికి ఆజ్యం పోసినట్లు మాట్లాడారు.
రోహిత్ ఆత్మహత్యకు దళిత రంగు పూస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దళితులకు, దళితేతరులకు మధ్య సమరం కాదని, దళితుల సమస్యగా ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ తప్పుడు ప్రచారం కారణంగానే తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తోందని ఇరానీ అన్నారు.
దాడికి గురైన ఎబివి విద్యార్థిన సుశీల్ కుమార్ ఓబిసి అని ఆమె చెప్పారు. పైగా, రోహిత్ సూసైడ్ నోట్లో ఓ రాజకీయ సంస్థ పేరు గానీ ఎంపి పేరు గానీ ప్రస్తావించలేదని, తాను సభ్యుడైన అంబేడ్కర్ విద్యార్థి సంఘాన్ని మాత్రమే ప్రస్తావించాడని ఆమె చెప్పారు. మొత్తం మీద, విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల క్షేమం కన్నా తనపై పడిన బురదను కడిగేసుకోవడానికే ఆమె ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించారు.