వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రానికి జివోఎం నో!: ఆన్‌లైన్‌లో అభిప్రాయ సేకరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విభజన విషయంలో వేసిన మంత్రుల బృందం(జివోఎం) రాష్ట్రానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నేతలు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌లో ఈ బృందం అభిప్రాయాలు సేకరిస్తోంది. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జివోఎం ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌లోనే వ్యవహారాలు నడిపించేస్తోంది. ప్రజలు తమకు ఏదైనా చెప్పాలన్నా నివేదించాలన్నా ఇంటర్నెట్ ద్వారా మెయిల్ చేయాలని కూడా సూచిస్తోంది.

ఎపిని విభజించి కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మంత్రులు సుశీల్ కుమార్ షిండే, ఎకె ఆంటోనీ, చిదంబరం, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, జైరాం రమేశ్ సభ్యులుగా మంత్రుల బృందంను ఏర్పాటు చేశారు. ఈ బృందానికి 11 అంశాలపై సిఫారసులు చేయాలని నిర్దేశించారు. మొత్తం పదకొండు అంశాలను విధివిధానాల్లో పొందుపరిచారు.

Will GoM come AP?

రెండు రాష్ట్రాల సరిహద్దుల నిర్ధారణ, పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వ్యవహరించటానికి తగిన పరిపాలనాపరమైన ఏర్పాట్లు, రెండు రాష్ట్రాల్లోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి సిఫారసులు చేయటం, సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు, జల వనరులు, విద్యుత్ తదితరాల పంపిణీ, ఆర్టికల్ 371 డితో ఎదురయ్యే సమస్యలు.. వాటికి పరిష్కారాలు తదితర అంశాలపై ఈ కమిటీ సిఫారసులు చేయాలి.

ఇందుకు వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని, అభిప్రాయాలను సేకరించి తన నివేదికను కేంద్ర కేబినెట్‌కు సమర్పించాల్సి ఉంది. గతంలో రాష్ట్రాలను విభజించినప్పుడు అనుసరించిన విధానం ప్రకారమైతే మంత్రుల బృందం సభ్యులు తమకు కేటాయించిన అంశాలపై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. దాని ద్వారా, బృందం స్వయంగా సమాచారాన్ని, అభిప్రాయాలను సేకరించాలి.

కానీ, ఎపి రాష్ట్ర విభజనకు సంబంధించి మాత్రం ఎవరైనా సమాచారం ఇవ్వదలచుకుంటే సమాచారం తమకు మెయిల్ చేయాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని అందుకున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మీరు ఏమైనా చెప్పదలచుకుంటే మెయిల్ చేయండి లేదా మాకు సమాచారం ఇస్తే మేము పంపిస్తాం అంటూ ఉద్యోగ సంఘాలతో రాయబారాలు నడుపుతున్నారు.

మంత్రుల బృందం రాష్ట్రానికి రాకుండానే ఈ మెయిల్ ద్వారా, కొరియర్‌లో సమాచారం అడగటం ఏమిటని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. మంత్రుల బృందం సభ్యులెవరూ రాష్ట్రంలో పర్యటించే అవకాశాలు కన్పించటం లేదని అత్యున్నత స్థాయి అధికార వర్గాలు కూడా తేల్చిచెబుతున్నాయి. గతంలో శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో పర్యటించి శాఖల వారీగా సేకరించిన సమాచారానికే జివోఎం ద్వారా సాధికారత తీసుకొచ్చి మమ అనిపిస్తారంటున్నారు.

సాధారణ పరిస్థితుల్లో అయితే మంత్రుల బృందం, నిపుణుల కమిటీ కనీసం కొన్ని ప్రాంతాల్లో అయినా పర్యటించి క్షేత్రస్థాయి నివేదికను రూపొందించాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో పర్యటించటానికి కమిటీలోని ఏ మంత్రి సిద్ధంగా లేకపోవటంతో ఢిల్లీ నుంచే పని పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోందంటున్నారు.

English summary
It is said that the Group of Ministers(GoM) will not come to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X