హైదరాబాద్లోనే అంకురార్పణ: బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం ఇలా సక్సెస్
భారత రక్షణ శాఖకు ప్రత్యేకించి వాయుసేనకు బ్రహ్మాస్త్రంగా మారనున్న ‘బ్రహ్మోస్’ క్షిపణికి అంకురార్పణ జరిగింది మన భాగ్యనగరంలోనే అంటే అతి శయోక్తి కాదు..
Recommended Video
న్యూఢిల్లీ: భారత రక్షణదళాల చరిత్రలో ఒక కొత్త అధ్యాయం లిఖితమైంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం అయింది. ఇప్పటికే భూమిపైనుంచి, సముద్రంపైనుంచి జరిపిన పరీక్షల్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న బ్రహ్మోస్.. తాజాగా గగనతలంలోనూ నిప్పులు చిమ్ముతూ, ప్రచండవేగంతో దూసుకెళ్లి లక్ష్యాన్ని ఛేదించింది. బుధవారం మధ్యాహ్నం భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానం నుంచి తొలిసారిగా బ్రహ్మోస్ను పరీక్షించామని రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
బ్రహ్మోస్-ఎయిర్లాంచ్డ్ క్రూయిజ్ మిసైల్ (ఏఎల్సీఎం) ప్రయోగాన్ని రెండు దశల్లో చేపట్టగా, బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించిందని తెలిపింది. ఈ ప్రయోగంతో 2.5టన్నుల బరువు గల బ్రహ్మోస్ క్షిపణికి 290కిలోమీటర్ల రేంజ్లో లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం ఉన్నదని మరోసారి నిరూపణ అయ్యిందని రక్షణశాఖ పేర్కొన్నది. తద్వారా భారత రక్షణ శాఖ మరో మైలురాయిని చేరుకున్నది.
వేగంగా ప్రయాణించే సూపర్ సోనిక్ క్షిపణి ఇది
దీంతో 3200 కిలోమీటర్ల సామర్థ్యం ఉన్న సుఖోయ్-30 ఎంకేఐ విమానాల ద్వారా ప్రయోగించడం వల్ల సుదూర లక్ష్యాలను కూడా బ్రహ్మోస్ సునాయాసంగా ఛేదించగలదని తేలింది. భూతలం, గగనతలం, సముద్రంపై నుంచి ప్రయాణించగలగడంతోపాటు ప్రపంచంలోనే వేగంగా ప్రయాణించగల సూపర్సోనిక్ క్షిపణి కావడం బ్రహ్మోస్ ప్రత్యేకత. ఇప్పటికే భూమిపై నుంచి, నీటి పైనుంచి ప్రయోగించగల బ్రహ్మోస్ క్షిపణులు ఆర్మీ, నౌకాదళ అమ్ములపొదిలోకి చేరాయి.
డీఆర్డీవో శాస్త్రవేత్తలకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందన
తాజా పరీక్షతో బ్రహ్మోస్ క్షిపణి భారత వాయుసేనకు బ్రహ్మాస్త్రంగా మారనున్నది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)లోని బ్రహ్మోస్ విభాగం డైరెక్టర్ జనరల్ సుధీర్మిశ్రా పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రయోగాన్ని వాయుసేన ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలించారు. క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ హర్షం వ్యక్తంచేశారు. డీఆర్డీవో శాస్త్రవేత్తల్ని ఆమె అభినందించారు. ఇది పాఠ్యపుస్తకాల్లో చోటు దక్కాల్సిన స్థాయి ప్రయోగం. దీనికోసం పనిచేసిన అందరికీ అభినందనలు అని డీఆర్డీవో చైర్మన్ ఎస్.క్రిస్టోఫర్ పేర్కొన్నారు. బ్రహ్మోస్ చేరికతో వాయుసేన సామర్థ్యం మరింత పెరుగుతుందని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
యుద్ద విమానాలుగా మారనున్న ఐఏఎఫ్ విమానాలు
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో భారత రక్షణశాఖను మరింత బలోపేతం కానున్నది. అత్యంత శక్తివంతమైన లక్షిత దాడుల్ని చేపట్టేందుకు భారత వాయుసేనకు బ్రహ్మోస్ ఉపయోగపడనున్నది. బ్రహ్మోస్ రాకతో మన వైమానికదళ విమానాలు శక్తివంతమైన క్షిపణులతో కూడిన యుద్ధవిమానాలుగా మారనున్నాయి. ఆదేశాలు వెలువడిన నిమిషాల్లోనే అవి సుదూర లక్ష్యాలను కూడా ఛేదించగలవు. రష్యానుంచి రూ. 77,835 కోట్ల ఖర్చుతో భారత్ 272 సుఖోయ్-30 రెండు సీట్ల యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. వీటిలో 240 ఇప్పటికే భారత వాయుసేనకు చేరాయి. ఈ పరీక్ష విజయవంతమైన నేపథ్యంలో 42 సుఖోయ్ యుద్ధ విమానాలను బ్రహ్మోస్తో అనుసంధానించి నిరంతరం సిద్ధంగా ఉండేలా చూడాలని రక్షణశాఖ భావిస్తున్నట్లు సమాచారం.
గల్ఫ్ యుద్ధం తర్వాత క్రూయిజ్ క్షిపణి వ్యవస్థపై ఇలా చర్చ
1990లో గల్ఫ్ యుద్ధం జరిగిన తర్వాత భారత్లోనూ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థ అవసరం అన్న చర్చసాగింది. దీని ఫలితంగా 1998లో భారత రక్షణ సలహాదారుగా ఉన్న ఏపీజే అబ్దుల్కలాం, రష్యా రక్షణశాఖ మంత్రి ఎన్వీ మిఖాయిలోవ్ సంతకాలతో ఓ ఒప్పందం కుదిరింది. ఈమేరకు మన డీఆర్డీవో, రష్యాకు చెందిన ఎన్పీవోఎం సంయుక్త భాగస్వామ్యంతో బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. దీనిలో 50.5శాతం భారత్, 49.5శాతం రష్యా భాగస్వామ్యం ఉంది. దీని క్షిపణి తయారీ విభాగాన్ని 2007లో హైదరాబాద్లో నెలకొల్పారు. రెండో తయారీ విభాగాన్ని తిరువనంతపురంలో ప్రారంభించారు. మూడో యూనిట్ను మహారాష్ట్రలోని నాగ్పూర్లో ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఒకేచోట నుంచి మూడు లక్ష్యాలను చేధించే సత్తా
బ్రహ్మోస్ పేరును భారతదేశంలోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్కా నదుల పేర్లను కలిపి రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) తయారు చేసిన అత్యంత బరువైన ఆయుధం బ్రహ్మోస్. శబ్దవేగానికన్నా మూడురెట్లు ఎక్కువ వేగంతో అంటే మాక్ 2.8స్పీడ్తో ఇది దూసుకెళ్లగలదు. సముద్ర అంతర్భాగం, గగనతలం, భూగోళంపై ప్రయోగించేందుకు వీలుగా దీనిని రూపొందించారు. ఒక చోటి నుంచి మూడు క్షిపణులతో వేర్వేరు దిశల్లోని లక్ష్యాలను ఢీకొట్టడం దీని ప్రత్యేకతల్లో ఒకటి. సుఖోయ్ యుద్ధవిమానం మూడు బ్రహ్మోస్ క్షిపణులను 3200 కి.మీటర్ల వరకు మోసుకెళ్లగలదు. క్షిపణి నిరోధక వ్యవస్థలు కూడా గుర్తించలేనంత తక్కువ ఎత్తులో బ్రహ్మోస్ ప్రయాణిస్తుంది. బ్రహ్మోస్తో ప్రపంచంలోనే సూపర్సోనిక్ క్షిపణుల్ని కలిగి ఉన్న ఏకైక సైన్యంగా భారత సైన్యం అవతరించింది.
క్షిపణి సామర్థ్య దేశాల సరసన భారత్
బ్రహ్మోస్ క్షిపణిని తొలిసారి 2016 జూన్ 25వ తేదీన యుద్ధ విమానంలో తొలిసారి పరీక్షించారు. బుధవారం నిర్వహించిన పరీక్షతో గగనతలం నుంచి క్షిపణులను సగర్వంగా ప్రయోగించగల సామర్థ్యం గల దేశాల సరసన భారత్ చేరింది. 9.55 మీటర్ల పొడవు, 0.65 మీటర్ల వెడల్పు గల దీని బరువు 2550 కిలోలు ఉంటుంది. 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలనూ చేధించే సత్తా దీని సొంతం. గంటకు 3457 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యంతో రూపుదిద్దుకున్న బ్రహ్మోస్ క్షిపణి 300 కిలోల వార్ హెడ్స్ ను సునాయాసంగా మోసుకెళ్లగలదు. అర కిలోమీటర్ - 9 కిలోమీటర్ల ఎత్తు నుంచి ప్రయోగించే ఈ క్షిపణి ప్రారంభంలోనే సుమారు వెయ్యి కిలోమీటర్ల వేగంతోనూ దూసుకెళ్లగల శక్తి ఉంది. గరిష్టంగా 14 వేల కిలోమీటర్ల ఎత్తుకూ దూసుకెళ్లగలదు బ్రహ్మోస్ క్షిపణి.