నకిలీ బెడద: అసలైన రూ. 500, 2000ల నోట్లను ఎలా గుర్తించాలంటే..?
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం విడుదలైన రూ. 2000 నోట్లకు పలువురు అక్రమార్కులు అప్పుడే నకిలీలను తయారు చేసి మార్కెట్లకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి కూడా రూ.2000 నోట్లను చూడని వారు ఆ నకిలీ నోట్లను గుర్తించే అవకాశం ఉండదు. ఇప్పటికే భారీ ఎత్తున నకిలీ నోట్లను పంజాబ్, బెంగళూరులో పోలీసులు పట్టుకున్నారు.
రూ.2000 నోట్లను ఫొటో కాపీ చేసి చెలామణి చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను బెంగళూరులో అరెస్ట్ చేశారు పోలీసులు. పంజాబ్లోని అమృత్సర్లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రూ. 3.2లక్షల విలువ చేసే నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రంలో కూడా ఇలాంటి నకిలీ నోట్లు బయటపడ్డాయి.
కాగా, అసలు నోట్లను కాపీ చేసి పెద్ద మొత్తంలో మార్కెట్లోకి వదిలేందుకు చాలా ముఠాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో తక్కువ మొత్తంలో నగదు చెలామణి అవుతున్న నేపథ్యంలో ఈ నోట్లను ప్రజల్లోకి తొందరగా చేరవేయడం వారికి సులభమవుతోంది.
ఈ నేపథ్యంలో నకిలీ నోట్లను గుర్తించేందుకు ఫైనాన్సియల్ ఇంటెలీజెన్స్ యూనిట్ పలు సూచనలు చేసింది. ప్రస్తుతానికి ఇటీవల విడుదలైన కొత్త నోట్లను పాకిస్థాన్ ముద్రించే స్థాయిలో లేదని పేర్కొంది. నకిలీ నోట్లు ముద్రించే వారు అసలు నోట్లలో ఉన్న సెక్యూరిటీ ఫీచర్లను పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో వాటిని నకిలీగా తేల్చడం చాలా తేలిక అని తెలిపింది. అయితే, మనం కొత్త నోట్లను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుందని వన్ఇండియాకు తెలిపింది.
నకిలీ నోట్లను గుర్తించడం ఎలా?
అసలు నోట్లను తాకినప్పుడు, నకిలీ నోట్లన తాకినప్పుడు ఆ రెండింటికీ మధ్య తేడా ఇట్టే తెలిసిపోతుంది. అసలు నోట్లు ప్రింట్ చేసిన పేపర్తో పోల్చితే నకిలీ నోట్ల పేపర్లు అంత నాణ్యతా ప్రమాణాలు ఉండవు. రూ. 2000 నోటు గాంధీ బొమ్మ ఉన్న సైడ్పై ఏడు బ్లీడ్ లైన్స్ ఉంటాయి. అదే రూ. 500 నోటు అయితే, ఐదు బ్లీడ్ లైన్స్ ఉంటున్నాయి.
అంతేగాక, అసలైన నోట్లలో సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. నోటును తిప్పుతూ చూస్తే.. గ్రీన్ నుంచి బ్లూకి రంగు మారుతుంది. అసలైన నోట్లపై ఉన్న సంఖ్య 500, 2000ల రంగు కూడా నోటును తిప్పుతూ చూస్తే మారుతూ కనిపిస్తోంది. ఈ మార్పులు నకిలీ నోట్లలో మనకు కన్పించవు.