అహో, భలే: కెసిఆర్ను ఆకాశానికెత్తిన సినీ స్టార్స్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును తెలుగు సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సోమవారం సాయంత్రం తెలుగు సినీ ప్రముఖులను గవర్నర్ నరసింహన్ సత్కరించారు.
Recommended Video
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికీ, తెలుగు భాష అభివృద్ధికీ కెసిఆర్ చేస్తున్న కృషిని సినీ ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన దివంగత నటులు కాంతారావు భార్య హైమవతి, ప్రభాకర్రెడ్డి భార్య సంయుక్తను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సముచితంగా సత్కరించారు. మరో దివంగత నటుడు శ్రీహరి భార్య శాంతిని కూడా గవర్నర్ సత్కరించారు.
తెలుగు వెలుగుతుంది: సూపర్స్టార్ కృష్ణ
దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ తెలుగువాడిని కావడం వల్లనే 300 సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. తెలుగును బతికించేందుకు సీఎం కేసీఆర్ మహాసభలను నిర్వహించడం హర్షణీయమని, కెసిఆర్ ద్వారా తెలుగు వెలుగుతుందని అన్నారు.
కేసీఆర్ అభిమానం అనిర్వచనీయం: నటి జమున
ప్రారంభ సమావేశంలో సీఎం కేసీఆర్ పద్యాలు పాడటం చూస్తే ఆయన భాషాభిమానం తెలుస్తోందని ప్రముఖ నటి జమున అన్నారు. దివంగత నటు డు కాంతారావు కుటుంబం తలదాచుకునేందుకు ఒక ఇల్లు సమకూర్చాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు: చిరంజీవి
ప్రపంచ తెలగు మహాసభల్లో తనను భాగస్వామిని చేసినందుకు మెగాస్టార్ చిరంజీవి కెసిఆర్కు ధన్యవాదాలు తెలిపారు. 1వ తరగతి నుంచి 12 వతరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేయాలని సీఎం నిర్ణయించడం చూస్తే సంతోషం కలుగుతోందని అన్నారు.
పోరాటయోధుడు కేసీఆర్:మోహన్బాబు..
బంగారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహిస్తున్నారని మోహన్ బాబు అన్నారు. తెలుగు భాష ఎక్కడ చచ్చిపోతుందో అని తెలుగు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసేందుకు కృషిచేస్తున్న తెలంగాణ పోరాట యోధుడు కేసీఆర్కు ధన్యవాదాలని అన్నారు. కేసీఆర్ గురించి చెప్పాలంటే వేదికకు సమయం సరిపోదని, పుస్తకమే రాయవచ్చునని అన్నారు.
ఇక్కడి వారికి ఎదిరించడమూ తెలుసు: నందమూరి బాలకృష్ణ
ప్రాంతాలు వేరైనా స్నేహ భావం వీడని తెలుగు ప్రజలకు, వీరతెలంగాణ పుత్రులు, సోదరీమణులకు కళాభివందనాలని బాలకృష్ణ అన్నారు. తెలంగాణ గడ్డమీద పుట్టిన వారికి అభిమానించడమే కాదు సమస్య వస్తే ఎదిరించడం కూడా తెలుసునని అన్నారు. మాతృభాషను కాపాడేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.
కేసీఆర్ అరుదైన నాయకుడు: రాజేంద్రప్రసాద్
ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ పుంభావ సరస్వతి అని రాజేంద్ర ప్రసాద్ ప్రశంసించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా గెలిచినపుడు తాను శాలువా తీసుకువెళితే.. మీరు కాదు నన్ను సన్మానించడం నేనే నిన్ను సన్మానిస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. కెసీఆర్ ఔదార్యం మరిచిపోలేనని అన్నారు. మనం అనేకమంది నాయకులను చూస్తాం. అమరావతి ప్రారంభానికి వచ్చిన కేసీఆర్ను వేదిక మీదకు పిలిచిన వెంటనే గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజలు చప్పట్లు కొట్టారని గుర్తు చేశారు. అక్కడ చూశాను తెలుగు ప్రజల్లో ఆయనకున్న ప్రత్యేకత అన్నారు.
సీఎం పద్యాలు ఆనందాన్నిచ్చాయి: కోట శ్రీనివాసరావు
తెలుగు మహాసభలు ప్రారంభం రోజు తాను ఎల్బీ స్టేడియానికి వచ్చానని, సీఎం కేసీఆర్ పద్యాలు పాడటం తనకు సంతోషం వేసిందని కోట శ్రీనివాస రావు అన్నారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు కేసీఆర్ శ్రమిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఆశయాలను సాధించేందుకు మనమంతా కృషి చేద్దామని అన్నారు.
తేట తేట తెలుగులా: నాగార్జున
తేట తేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా.. మనమంతా తెలుగు భాషను కాపాడుకునేందుకు ప్రయత్నిద్దామని నాగార్జున అన్నారు. సీఎం కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం ఆనందం కలిగించిందన్నారు. వెలకట్టలేని సంపద అయిన మన తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేద్దామని వెంకటేష్ పిలుపునిచ్చారు. భాషను కాపాడటానికి సీఎం కేసీఆర్ ఆయన బృందం చేస్తున్న మహాయజ్ఞం నెరవేరాలని, ప్రతి సినిమా హోర్డింగ్ మీద తెలుగు భాష గురించి నినాదాలను ముద్రించాలని ప్రభుత్వం నిబంధన తేవాలని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కోరారు.
కేసీఆర్ కారణజన్ముడు: బ్రహ్మానందం
తెలుగుచదువుకున్న వాడు ముఖ్యమంత్రి కాగలరని కే చంద్రశేఖర్రావు చూపించారని బ్రహ్మానందం అన్నారు. తెలుగు చదువుకున్న వారు దేశాన్ని శాసించగలరని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కారణజన్ముడని అన్నారు. ఆయన తొమ్మిదిమంది సంతానం తరువాత ఎందుకు పుట్టారంటే తెలంగాణ జాతిపిత కావడానికేనని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలందరి ముద్దుబిడ్డ. తన గురువుకు మోకాళ్ల మీద వంగి పాదాభివందనం చేయడం ఆయనలో వినయం, సంస్కారాన్ని తెలుపుతున్నదని అన్నారు.
కేసీఆర్ ప్రధాని కావాలి: ఆర్ నారాయణమూర్తి
కోట్ల మంది ప్రజలు చూస్తుండగా.. సీఎం కేసీఆర్ తన గురువుకు వేదికపై పాద నమస్కారం చేశారని ఆర్ నారాయణ మూర్తి గుర్తు చేస్తూ అలాంటి కేసీఆర్కు నా నమస్కారాలని అన్నారు. పీవీ నరసింహారావులాంటి రాజకీయ చతురత, సాహిత్య జిజ్ఞాస ఉన్న సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. హ్యాట్సాఫ్ టు కేసీఆర్.. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణను సాధించారని అన్నారు.