బెంగుళూరు యాహూలో 2వేలమందికి ఉద్వాసన?
న్యూఢిల్లీ: ప్రముఖ ఐడీ దిగ్గజం 'యాహూ' తన బెంగుళూరు కార్యాలయంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించడం కోసం కంపెనీని రీస్ట్రక్చరింగ్ చేస్తున్నామని యాహూ ఇండియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ ప్రాచి సింగ్ వెల్లడించారు.
ఐతే, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నారన్న అంశంపై మాట్లాడుతూ, ఇప్పటికిప్పుడు దీనికి సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించలేమని తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు యాహూ క్యాంపస్ లోని సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ సెంటర్లో 2500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
యాహూ పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 2 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన తప్పదనే ఊహాగానాలు వినిపించాయి. చివరకు కేవలం 250 మంది ఉద్యోగులు మాత్రమే కంపెనీలో మిగులుతారని ఓ రిపోర్ట్ చెబుతోంది.
ఉద్వాసన పలికే ఉద్యోగులకు సెవెరాన్స్ ప్యాకేజీ కింద ఆరు నెలల జీతం ముందుగానే చెల్లించనున్నారు. యాహు ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ మంగళవారం నుంచి పూర్తిగా మూసివేయబడిందని ఊహాగానాలు వినిపించాయి.
ఇక యాహూ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక ఇంటర్నెట్ సేవాధారిత సాఫ్టువేర్ సంస్థ. దీని సృష్టికర్తలు స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ ఫిలో మరియు జెర్రీ యాంగ్. ఇది ఒక సర్చ్ ఇంజిన్ను, ఈ-మెయిల్ సేవను, డైరెక్టరీ సేవలనూ మరియు ఇతర వెబ్ ఆధారిత సేవలను అందిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా లోని సన్నీవేల్ లో ఉంది.