ఆండ్రాయిడ్: విద్యార్థుల ప్రశ్న,తడబడ్డ సుందర్ పిచాయ్
ఢిల్లీ: దేశ రాజధాని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో యువతీ యువకులు అడిగిన పలు ప్రశ్నలకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గురువారం నాడు సమాధానాలు చెప్పారు. వారు సరదాగా అడిగిన ప్రశ్నలకు పిచాయ్ అంతే సరదాగా జవాబిచ్చారు. ఓ సరదా ప్రశ్నకు మాత్రం పిచాయ్ ఒకింత తడబడ్డారు.
మా అమ్మను అడిగి చెబుతానని సుందర్ పిచాయ్ నవ్వుతూ చెప్పారు. గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ వర్షన్లకు అన్నీ విదేశీ వంటకాల పేర్లే పెడుతున్నారని, భారతీయ వంటకం పేరు పెట్టవచ్చు కదా అని విద్యార్థులు అడిగారు. దానికి సుందర్ పిచాయ్ తొలుత తడబడ్డారు.
ఆ తర్వాత.. దీనిపై మా అమ్మను అడగాల్సిందేనని చెప్పారు. పేరును నిర్ణయించడానికి ఆన్ లైన్లో పోల్ నిర్వహించే అవకాశముందన్నారు.
అయితే, విద్యార్థులు మాత్రం ఆండ్రాయిడ్ కొత్త వర్షన్కు కొన్ని వంటకాల పేర్లు సూచించారు. పెడా, నెయ్యప్పమ్, నాంఖటాయ్, పాయసం వంటి వంటకాలు సూచించారు. దానికి సుందర్ పిచాయ్ ఆండ్రాయిడ్ పి వర్షన్కు ఆ పేర్లు పెట్టే విషయమై చూస్తామని అభిప్రాయపడ్డారు.
విద్యార్థులు వంటకాల పేర్లను సూచించడంతో సుందర్ పిచాయ్ నవ్వుల్లో మునిగిపోయారు. ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంకు డోనట్, ఎక్లెయినర్, జింజర్ బ్రెడ్, ఐస్ క్రీమ్, శాండ్ విచ్, జెల్లీ బీన్, కిట్ క్యాట్, లాలీపాప్ వంటి పేర్లను పెట్టారు. తాజా వర్షన్కు మార్ష్మా పేరును పెట్టారు. ఈ నేపథ్యంలో భారతీయ వంటకాల పేర్లు పెట్టాలని విద్యార్థులు సూచించారు.