సుష్మా గొంతు తీపి: షిండే, అద్వానీ కంటతడి
న్యూఢిల్లీ: పదిహేనవ లోక్సభలో చివరి రోజు శుక్రవారం ఉద్వేగభరిత సంఘటనలు చోటు చేసుకున్నాయి. బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీ కంట తడిపెట్టారు. లోకసభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ గొంతు స్వీట్ల కన్నా తీయన అంటూ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రశంసించారు. బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీ సిపిఎం సభ్యులుసహా అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ ప్రశంసించారు సభలో ఆయనకు ఇదే ఆఖరి సెషన్ అనే తరహాలో, దాదాపు ఆయనకు వీడ్కోలు పలుకుతున్న స్థాయిలో సభ్యులంతా ప్రశంసిస్తూ ప్రసంగాలు చేశారు.
సిపిఎం సభ్యుడు బాసుదేవ ఆచార్య ఆయనను 'ఫాదర్ ఆఫ్ ద హౌస్'గా అభివర్ణించారు. మిగతా సభ్యులూ అదే రీతిలో ఆయనను పొగిడారు. "అద్వానీజీ నాకు బాధగా ఉంది. మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తాను.. మీ పార్టీని బలోపేతం చేయడంలో మీరు కీలకపాత్ర పోషించారు. పార్టీ బలోపేతమైందిగానీ, మీరు బలహీనమయ్యారు'' అని ములాయం సింగ్ యాదవ్ అన్నారు.
ములాయం, షిండే, కమల్నాథ్.. ఇలా ఒకరి తర్వాత ఒకరు ప్రశంసిస్తుంటే అద్వానీ అతికష్టం మీద తన భావోద్వేగాలను నిలువరించుకున్నారు. అద్వానీ అడుగుజాడల్లో నడిచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానంటూ సుష్మాస్వరాజ్ చెబుతున్న సమయంలో మాత్రం ఆయన తన భావోద్వేగాన్నినిలువరించుకోలేపోయారు. చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ కనిపించారు.
కాగా, మీ గొంతు చాలా తియ్యగా ఉంటుంది. మిఠాయి కన్నా తీయగా ఉంటుంది అని సుశీల్ కుమార్ షిండే సుష్మా స్వరాజ్ను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ బిల్లు విషయంలో సుష్మా తీరు అభినందనీయమని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుకు బిజెపి మద్దతు ఇస్తుందనే నమ్మకం మొదట్లో నమ్మకం కుదరలేదని, పదేళ్ల కిందట సోనియా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణను ఏర్పాటు చేసే విషయంలో బిజెపి ప్రతిష్ట కోసం పాకులాడలేదని షిండే అన్నారు.
సోనియా గాంధీని సుష్మా స్వరాజ్ ప్రశంసించారు. సోనియా హుందాతనం వల్ల, ప్రధాని మృదుత్వం వల్ల 15వ లోకసభ సమావశాలు సజావుగా సాగాయని, పార్లమెంటరీ వ్యవహారాల కమల్నాథ్ కొంటెతనం ప్రదర్శించగా, సభా నేత షిండే మంచితనం ప్రదర్శించారని సుష్మా అన్నారు.