జగన్ సంచలనం: చంద్రబాబుకు బిజెపి గుడ్బై, పవన్తో సై
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమీకరణాలు మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటిస్తూ కాంగ్రెసుకు గుబులు పుట్టించడానికి ప్రయత్నిస్తుంటే, జగన్ అనూహ్యమైన ప్రకటన చేసి చర్చను మలుపు తిప్పే ప్రయత్నం చేశారు.
బిజెపితో జత కట్టడానికి తాను సిద్ధమేనని జగన్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అందుకు ఆయన ఓ షరతు పెట్టారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనేది ఆ షరతు. దీన్నిబట్టి ఆయన బిజెపితో కలిసి నడవడానికి సిద్ధమని ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లే అయింది.
బాబుకు దూరమవుతున్న బిజెపి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి క్రమంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి దూరమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల తర్వాత మోడీ చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇచ్చి భేటీకి అవకాశం కల్పించారు. అయితే, అది చంద్రబాబుు అంత అనుకూలంగా ఏమీ జరగలేదనే మాట కూడా వినిపిస్తోంది. చంద్రబాబుతో కలిసి నడిస్తే సొంతంగా ఎదగడం సాధ్యం కాదనే అభిప్రాయంతో బిజెపిలోని ఓ వర్గం ఉంది. అదే ఆలోచనతో బిజెపి జాతీయ నాయకత్వం నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్తో చంద్రబాబు అడుగులు..
చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. సొంతంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కల్యాణ్ పోటీ చేసినప్పటికీ అది చంద్రబాబుకు అనుకూలంగానే ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణ పర్యటనలో కూడా పవన్ కల్యాణ్ బిజెపిపై విమర్శలు చేశారు. దీన్నిబట్టి ఆయన బిజెపికి దగ్గరయ్యే అవకాశాలు లేవని అనిపిస్తోంది.
జగన్పై పురంధేశ్వరి ఇలా...
జగన్ పొత్తుకు ప్రత్యేక హోదా అంశాన్ని షరతుగా పెట్టడంపై బిజెపి సీనియర్ నేత పురంధేశ్వరి స్పందించారు. ఇప్పుడు ప్రత్యేక హోదాను లేవనెత్తడం సరైంది కాదని ఆమె అన్నారు. ఆమె మాటలను బట్టి జగన్తో బిజెపి పొత్తుకు సానుకూలంగా ఉందని అర్థమవుతోంది.
జగన్పై మండిపడిన కాంగ్రెసు
బిజెపితో పొత్తుకు సానుకూల సంకేతాలు ఇచ్చిన వైయస్ జగన్పై కాంగ్రెసు మండిపడింది. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన తర్వాత జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడడమేమిటని జెడి శీలం ప్రశ్నించారు. కేసులకు భయపడి జగన్ బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు. జగన్పై వామపక్షాలు కూడా మండిపడ్డాయి.