శంకరరావుతో జగన్ చేతులు కలిపారు (ఫొటో)
హైదరాబాద్: కాంగ్రెసు నాయకుడు, మాజీ మంత్రి పి. శంకరరావు కారణంగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఇరుక్కున్నారు. ఆ కేసులతో ఆయన ముప్పుతిప్పలు పడుతున్నారు. ఆ రకంగా వీరిద్దరు బద్ధశత్రువులే. కానీ, వారిద్దరు కరచాలనం చేసుకున్న అరుదైన సంఘటన మంగళవారంనాడు చోటు చేసుకుంది.
వైయస్ జగన్ శంకరరావుకు నమస్కారం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి మరణం నేపథ్యంలో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించేందుకు మంగళవారం ఉదయం జగన్ కాకా నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా జగన్, కాకాకు నివాళి అర్పించి, ఆయన కుమారులు వివేక్, వినోద్లను పరామర్శించారు. ఆ తర్వాత అక్కడే జి వెంకటస్వామి అల్లుడు శంకర్రావుతో కరచాలనం చేశారు.
అయితే, వారిద్దరు తారసపడింది క్షణకాలమే అయినా ఇరువురూ కరచాలనం చేసుకోవడంతో పాటు పరస్పరం అభివాదం చేసుకోవడం జరిగిపోయింది. పి. శంకరరావు వెంకటస్వామి పెద్దల్లుడనే విషయం తెలిసిందే. వెంకటస్వామి కుమారులను పలకరించినట్లుగానే జగన్ అల్లుడినీ పలకరించాడని చెప్పుకోవచ్చు. అయితే, శంకరరావుతో ఆ మాత్రం సామీప్యం కూడా చర్చనీయాంశంగానే మారింది.
జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ సహా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు కొనసాగిస్తున్న దర్యాప్తునకు శంకర్రావు లేఖనే నేపథ్యమన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేరకే తాను హైకోర్టుకు లేఖ రాశానని గతంలో శంకర్రావు బహిరంగంగానే ప్రకటించారు. ఆ తర్వాత జగన్ పై దర్యాప్తునకు హైకోర్టు సీబీఐకి ఆదేశాలివ్వడం, జగన్ జైలుకెళ్లడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఒకరికొకరు తారస పడలేదు.