ఎన్డీయేలోకి జగన్, మధ్యవర్తిగా ‘గాలి’: ‘రిపబ్లిక్’ ఏం చెప్పిందంటే?
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీయే కూటమిలో చేరుతున్నారా? అంటే అవుననే వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఏదో విషయమై కేంద్రమంత్రులు, ప్రధానిని కలుస్తూనే ఉంటున్నారు జగన్.
తాజాగా రిపబ్లిక్ టీవీలో వచ్చిన కథనం ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఎన్డీయే కూటమిలో ఉన్న నేపథ్యంలో ఈ చేరికకు ప్రాధాన్యత సంతరించుకోనుంది.
ఎన్డీఏలోకి జగన్
ఇటీవల జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ పార్టీ ఎన్డీయే అభ్యర్థులకే మద్దతు తెలపడం గమనార్హం. ఇది ఇలావుంటే ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయకుండా... రాష్ట్ర ప్రభుత్వంపైనే ప్రధాన విమర్శలు చేస్తుండటం గమనార్హం. వైసీపీ కేంద్రంలో పేరుకు ప్రతిపక్షమైనప్పటికీ... అధికారపక్షానికి అనుబంధంగానే ఉంటోందనేందుకు ఇవన్నీ నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు జగన్ ఏకంగా ఎన్డీయేలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
రిపబ్లిక్ ప్రత్యేక కథనం
జాతీయ మీడియాలో ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు ఆర్నబ్ గోస్వామి నిర్వహిస్తున్న ‘రిపబ్లిక్ టీవీ' ఈ విషయంపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ‘అత్యంత విశ్వసనీయ వర్గాలు' అని ఉటంకిస్తూ... ఆదివారం ఈ కథనాన్ని ఇచ్చింది.
ఏం చెప్పిందంటే..
‘జగన్ బీజేపీతో చేతులు కలిపేందుకు అంతా సిద్ధమైంది. బీజేపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. బీజేపీ అధిష్ఠానానికీ, జగన్కు మధ్య కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. జగన్ను ఆయనే బీజేపీలోని ముగ్గురు ముఖ్య నాయకుల వద్దకు తీసుకెళ్లారు. ఎన్డీయేలో భాగస్వామి అయ్యేందుకు జగన్ తన సమ్మతి తెలియచేశారు' అని రిపబ్లిక్ టీవీ పేర్కొంది.
బీజేపీ ఇలా..
కాగా, ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగించాలా? లేక వైసీపీని కలుపుకుని ముందుకు వెళ్లాలా? అనేది ఎన్నికల నాటికి నిర్ణయం తీసుకుంటామని ఓ బీజేపీ సీనియర్ జాతీయ నేత చెప్పడం గమనార్హం. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అవినీతి ఆరోపణలను ఆయన లెక్కలోకి తీసుకోనట్లే తెలుస్తోంది.
మరుసటి రోజే.. బాబు వదిలేస్తారా??
ఆ బీజేపీ నేత వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే రిపబ్లిక్ టీవీలో ఎన్డీఏలోకి జగన్ అంటూ కథనం రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ స్పష్టమైన రాజకీయ లక్ష్యాలను నిర్దేశించుకుంటోంది. కాగా, చాలా కాలం నుంచి ఎన్డీయేలో కొనసాగుతున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును బీజేపీ పక్కన పెట్టే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఎన్నికల వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచిచూడాల్సిందే.