మీకో దండమంటూ వెళ్లిన జగన్, మార్షల్స్ ఎత్తుకెళ్లారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు సభాపతికి మీకో దండం అంటూ వెళ్లిపోయారు. తమ పార్టీకి చెందిన ఎనిమిది మంది శాసన సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ నిరసన తెలిపింది. స్పీకర్కు వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. జగన్ కూడా స్పీకర్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
అయితే, స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ నుండి వాకౌట్ చేసింది. జగన్ తన స్థానం నుండి లేచి నిలబడి.. మీకో దండం అంటూ సభ నుండి బయటకు వచ్చారు. ఆయనను మిగతా సభ్యులు అనుసరించారు.
స్పీకర్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధికార పార్టీ ఆదేశాలతో స్పీకర్ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని వైసీపీ సభ్యులు విమర్శలు గుప్పించారు. తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సస్పెండైన సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు ప్రయత్నించగా.. మార్షల్స్ రంగంలోకి దిగి వారిని అక్కడి నుండి బలవంతంగా పంపించారు. సభలోనే కాకుండా.. మీడియా పాయింట్ వద్ద కూడా తమ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు.
అంతకుముందు ఏపీ అసెంబ్లీ నుంచి సస్పెండైన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మార్షల్స్తో వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీ నుంచి సస్పెండైన 8 మంది సభ్యులు అసెంబ్లీ హాలు గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. ఆందోళనను విరమించాలని మార్షల్స్ కోరారు. దీనిపై తాము తెలంగాణ అసెంబ్లీ ప్రాంతంలో ఉన్నామని చెపుతూ వైసీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్కు వాదనకు దిగారు.