జేసీ రాజీనామా: మూడో డిమాండ్-కమిషన్.. జగన్ పత్రిక సంచలనం?
అనంతపురం ఎంపి జేసీ దివాకర్ రెడ్డి రాజీనామాపై విపక్ష అధినేత వైయస్ జగన్కు చెందిన సాక్షి ఓ కథనం రాసింది.జేసీది రాజీడ్రామా అని, ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని పేర్కొంది.
అనంతపురం: అనంతపురం ఎంపి జేసీ దివాకర్ రెడ్డి రాజీనామాపై విపక్ష అధినేత వైయస్ జగన్కు చెందిన సాక్షి ఓ కథనం రాసింది. జేసీది రాజీడ్రామా అని, ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని పేర్కొంది.
జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా డ్రామా బెదిరింపులకు టిడిపి అధిష్టానం దిగొచ్చిందని పేర్కొంది. తద్వారా బెదిరింపులకు పాల్పడితే తప్ప అధిష్టానం దిగిరాదనే చర్చ జరుగుతోందని పేర్కొంది.
జేసీ దివాకర్ రెడ్డి ఏమన్నారంటే
ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉండి తాను ప్రజలకు ఏం చేయలేకపోతున్నానని, తన సిఫార్సులు పని చేయడం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నానని గత నెల జేసీ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన నీటిని విడుదల చేసేలా చేసుకున్నారు. ఆ తర్వాత రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. రాజీనామా చేస్తే ఏమొస్తుందని, ఆ రోజు బాధలో మాట్లాడానని జేసీ అన్నారు.
జేసీ పనులు చక్కబెట్టటం మినహా అంటూ
మూడున్నరేళ్ల పాలనపై అసంతృప్తి వ్యక్తం చేసి రాజీనామా చేసిన జేసీ పది రోజుల్లో సంతోషం ప్రకటించారని పేర్కొంది. అయితే జేసీ దివాకర్ రెడ్డి తన నియోజకవర్గంలో పనుల పైనే అసంతృప్తి వ్యక్తం చేశారనేది గమనార్హం. జేసీ తన పనులు చక్కబెట్టుకునేందుకు బ్లాక్ మెయిల్ రాజకీయం చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
మూడు డిమాండ్లలో రెండు పరిష్కారం
జేసీ రాజీనామా వెనుక పలు కారణాలు ఉన్నాయని, మూడు డిమాండ్లు ఆయన ప్రభుత్వం ముందు ఉంచారని, వాటిని పరిష్కరించుకునేందుకే రాజీనామా అంశాన్ని తెరపైకి తెచ్చారని అప్పట్లో వాదనలు వినిపించాయి. ఈ మూడు డిమాండ్లలో రెండు పరిష్కారమయ్యాయని పేర్కొంది. జేసీ బ్లాక్ మెయిల్ చేసి చాగల్లుకు నీరు కేటాయింప చేసుకున్నారని టిడిపి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా ఆరోపించారు. జేసీ రోడ్ల విస్తరణ డిమాండ్ పైన కూడా సానుకూల స్పందన వచ్చిందన్నారు.
మూడో షాకింగ్ డిమాండ్
ఈ మూడో డిమాండ్ పైనే సాక్షి షాకింగ్ ఆరోపణ చేసింది. హెచ్చెల్సీ టెండర్ల అగ్రిమెంట్ పైన ఈ ఆరోపణ. ఈ టెండర్ దక్కించుకున్న సంస్థను స్థానిక నేతతో పాటు అమరావతిలోని ఓ చినబాబు కూడా కమిషన్ అడిగారని, దీంతో ఆ సంస్థ అగ్రిమెంట్ పనులను పక్కన పెట్టిందని, ఈ అగ్రిమెంట్ సానుకూలమయ్యేందుకు జేసీ రాజీనామా అంశాన్ని తెరపైకి తెచ్చారని చర్చ నడుస్తోందని సంచలన ఆరోపణ చేసింది.
బాబు క్లాస్ తీసుకున్నారని
అయితే దీనిపై మంత్రి దేవినేని సర్ది చెప్పారని, సీఎం చంద్రబాబు కూడా జేసీని గట్టిగా వారించారని తెలుస్తోందని పేర్కొంది. ఇది కాంగ్రెస్ కాదని, బ్లాక్ మెయిల్ రాజకీయాలు కుదరవని చెప్పారని తెలుస్తోందని పేర్కొంది. ఈ మూడు డిమాండ్ల పరిష్కారం కోసమే రాజీనామా డ్రామా ఆడారనే వాదనలు వినిపిస్తున్నాయని పేర్కొంది.