తెలంగాణలో లాక్డౌన్ను బ్రేక్ చేస్తే.. జేబులు ఖాళీ: మూడుసార్లు బయట కనిపిస్తే జరిమానా
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా నివారించడానికి ఉద్దేశించిన లాక్డౌన్ను బ్రేక్ చేస్తోన్న వారిపై తెలంగాణ ప్రభుత్వం ఇక భారీ జరిమానాలకు దిగుతోంది. ఇంట్లో నుంచి బయటికి రావొద్దంటూ అధికార, పోలీసు యంత్రాంగం ప్రాధేయపడుతున్నా, లాఠీ ఛార్జీలకు పూనుకుంటున్నా ఫలితం కనిపించకపోవటంతో ఇక జరిమానాలను విధించేలా చర్యలు తీసుకుంది. భారీగా ఫైన్ విధిస్తోంది. జరిమానాలను వసూలు చేస్తోంది కేసీఆర్ సర్కార్.
లాక్డౌన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకుని నడిరోడ్డు మీద విధులను నిర్వర్తించే కానిస్టేబుళ్ల వరకు దండం పెట్టి మరీ విజ్ఙప్తి చేశారు. దీన్ని పట్టించుకున్న వారి సంఖ్య దాదాపు లేదనే అనుకోవచ్చు. ఏదో ఒక కారణంతో రోడ్ల మీద బలాదూర్గా తిరుగుతున్నారు. ఎలాంటి కారణం లేకుండా రోడ్ల మీద తిరిగే వారి సంఖ్య గ్రామస్థాయిలో మరింత ఎక్కువగా ఉంటోంది.
దీన్ని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జరిమానాలను విధించే ప్రక్రియను చేపట్టింది. ఒకేరోజు మూడుసార్లు లేదా అంతకు మించి ఎక్కువసార్లు కనిపిస్తే.. 500 రూపాయల వరకు జరిమానా విధిస్తోంది. అయిదుసార్లు కనిపిస్తే వెయ్యి రూపాయలను జరిమానా విధించనుంది. ఈ ప్రక్రియను స్థానిక సంస్థలకు అప్పగించింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండల్ ఇటిక్యాలలో తొలిసారిగా మిట్టమెల్లి రాజారెడ్డి అనే వ్యక్తికి ఫైన్ వేశారు. ఒకేరోజు మూడుసార్లు రోడ్ల మీద తిరుగుతూ కనిపించడంలో అతనిపై జరిమానా విధించారు. అతని వద్ద నుంచి 500 రూపాయలను వసూలు చేశారు.
Recommended Video
లాక్డౌన్ కొనసాగుతున్న ప్రస్తు పరిస్థితుల్లో ఒకేరోజు మూడుసార్లు బయట తిరుగుతూ కనిపించడం వల్ల 500 రూపాయల జరిమానా విధించినట్లు ఇటిక్యాల గ్రామ కార్యదర్శి వెల్లడించారు. జరిమానాకు సంబంధించిన రశీదును కూడా అతని చేతిలో పెట్టారు. అన్ని రకాలుగా తాము విజ్ఙప్తి చేసినప్పటికీ.. ప్రజలు వినిపించుకోవట్లేదని, అందుకే జరిమానాలను విధించడం వల్ల మార్పు వస్తుందని తాము ఆశిస్తున్నట్లు ఇటిక్యాల గ్రామ కార్యదర్శి వెల్లడించారు.