లక్షకోట్లు తిన్నానని ప్రచారం చేసి నమ్మేలా చేశారు, నిరూపిస్తారా? : జగన్
Published : July 18, 2018 11:20 AM (IST)
వచ్చే ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఎట్టి పరిస్థితుల్లోను ప్రతీకారం తీర్చుకోనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం మొదట ప్రవేశ పెట్టింది తామే అన్నారు.ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు రాజీనామా చేశారని, ఉపఎన్నికలు పెట్టాలనుకుంటే ఇప్పుడు కూడా పెట్టవచ్చునని చెప్పారు. ప్రత్యేక హోదా వల్ల ఏం ప్రయోజనమని, హోదా వల్ల ఇతర రాష్ట్రాలు బాగుపడ్డాయా అని మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. కోడలు కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా అని మాట్లాడింది చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముందు ఆయన డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఇవన్నీ ప్రజలకు తెలుసునని చెప్పారు. వారు గమనిస్తున్నారని తెలిపారు.తాను అధికారంలోకి వచ్చాక చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకోనని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబుపై వచ్చిన అన్ని అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించడం ఖాయమని చెప్పారు. తప్పు చేసిన వారికి మాత్రం కచ్చితంగా శిక్ష పడాలన్నారు. దేవుడి దయ వల్ల ప్రతీకారం తీర్చుకునే గుణం తనకు లేదని, కానీ తప్పు చేసినప్పుడు విచారణ జరపాలన్నారు. అన్ని అంశాలపై విచారణ జరుపుతానని చెప్పారు.