నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అంటే ఏంటి..? ఇది ఎంత వరకు ఉపయోగకరం..?
న్యూఢిల్లీ: నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్.. దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట వేదికగా ప్రకటించిన ఓ సరికొత్త ప్రాజెక్టు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఇది. దేశ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందంటూ ప్రధానమంత్రి చేసిన ప్రకటనతో అందరి దృష్టీ దీని మీదే నిలిచింది. అసలేంటి ఈ డిజిటల్ హెల్త్ మిషన్.?.. మరో ఆధార్ తరహా ప్రయోగమా?.. దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటీ? అనే ప్రశ్నలకు సమాధానానలు అన్వేషిస్తున్నారు.
వచ్చే వెయ్యి రోజుల్లో: ఎల్ఓసీ నుంచి ఎల్ఏసీ దాకా: శతృవు ముఖం పగులగొట్టేలా: మోడీ
దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచడానికి ప్రధాని ప్రకటించిన మరో వినూత్న పథకం ఇది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని డిజిటలీకరిస్తారు. ఇదివరకు చేయించుకున్న సర్జరీ, ఇతర అనారోగ్య సంబంధ వివరాలనూ ఇందులో పొందుపరుస్తారు. ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి మెడికల్ హిస్టరీని ఒకేచోట క్రోడీకరిస్తారు. ఆ వివరాలన్నింటినీ డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు. దాన్ని ఆసుపత్రులతో అనుసంధానిస్తారు. రిజిస్టర్ అయిన డాక్టర్లతో కూడిన సర్వర్తో అనుసంధానిస్తారు.
మెడికల్ హిస్టరీ, ఇదివరకు చేయించుకున్న చికిత్స, రోగ నిర్ధారణ వంటి అంశాలను క్రోడీకరించిన తరువాత ఓ నంబర్ను దానికి కేటాయిస్తారు. ఈ నంబర్ను వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్లతో అనుసంధానిస్తారు. చికిత్స కోసం ఓ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లిన తరువాత.. ఈ నంబర్ను చెబితే.. అతనికి సంబంధించిన పూర్తి మెడికల్ బయోగ్రఫీ డాక్టర్కు తెలుస్తుంది. ఫలితంగా.. ఎలాంటి చికిత్సను ఇవ్వాలి? ఎలాాంటి మందులను వినియోగించాలనే అంశంపై డాక్టర్లకు ఓ అవగాహన ఏర్పడుతుంది. దీనివల్ల ఏ వ్యక్తి కూడా తన వెంట వైద్య పరీక్షల రిపోర్టులు, ప్రిస్కిప్షన్లను తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి ఆరోగ్య సమాచారం, అతను తరచూ ఎదుర్కొనే అనారోగ్య సంబంధ వివరాలు, దానికి ఇదివరకు నిర్వహించిన చికిత్స.. వంటి అంశాలన్నింటినీ ఒకేచోటికి తీసుకుని రావడం వల్ల భవిష్యత్తులో ఆ సమాచారం కోసం వెదుక్కోవాల్సిన అవసరం ఉండదు. కొత్తగా పరీక్షలను చేయించుకోవాల్సిన అవసరమూ రాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మెడికల్ హిస్టరీని తెలుసుకుంటే.. ఆ వ్యక్తికి ఎలాంటి చికిత్సను అందించాలనే విషయంపై సంబంధిత డాక్టర్కు ఓ అవగాహన వస్తుందని, ఫలితంగా హెల్త్ సర్వీసులు వేగవంతం అవుతాయని కేంద్రం చెబుతోంది.
తన మెడికల్ హిస్టరీ, దానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ఆ వ్యక్తి అనుమతితోనే డాక్టర్లు లేదా వైద్య సిబ్బంది సేకరించాల్సి ఉంటుంది. దీనికోసం వన్ టైమ్ యాక్సెస్ సౌకర్యాన్ని డాక్టర్లకు కల్పిస్తారు. అలాగే.. చికిత్స అనంతరం ఆ వ్యక్తికి సంబంధించిన ప్రిస్కిప్షన్, డయాగ్నస్టిక్ రిపోర్ట్స్, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వివరాలను కూడా ఇందులో భద్రపరుస్తారు. ఆ వివరాలన్నీ భద్రంగా ఉంటాయా? అనే అనుమానాలను కేంద్ర ప్రభుత్వం తెర దించింది. ఎలాంటి సెక్యూరిటీ బ్రీచ్ ఉండబోదని హామీ ఇస్తోంది. డాక్టర్లు మాత్రమే వన్టైమ్ యాక్సెస్ ఉంటుంది..అది కూడా పరిమిత గడువులోపే.