1947 ఆగష్టు 15న గాంధీజీ ఎక్కడున్నారు.. నాడు జరిగిందేమిటి..?
భారత దేశానికి 15 ఆగష్టు 1947న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి వరకు భారత్ను పాలించిన తెల్లదొరలు... దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించారు. ఇక అప్పటి నుంచి భారత్ స్వపరిపాలన కిందకు వచ్చేసింది. ప్రపంచం అంతా గాఢ నిద్రలో ఉండగా ఆ రోజు అర్థరాత్రి భారత దేశం స్వాంతంత్ర్య సంబురాలను ఘనంగా జరుపుకుంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.
స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది బలిదానాలు చేశారు. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాలని తెల్లదొరల కబంద హస్తాల నుంచి స్వపరిపాలన వైపు భారత్ అడుగులు వేయాలన్న సమరయోధుల కలలు నిజమైంది. అయితే అహింసే ఆయుధంగా చేసుకుని తుది వరకు పోరాటం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మాత్రం 1947 ఆగష్టు 15 వేడుకలు తిలకించేందుకు ఢిల్లీలో లేరు. అయితే గాంధీజీ ఎక్కడున్నారనే దానిపై పెద్ద చర్చే జరిగింది.
గాంధీజీ అక్కడకు ఎందుకు వెళ్లారు..?
మహాత్మాగాంధీ... దేశానికి జాతిపిత. 1947 ఆగష్టు 15న భారత్కు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ అందులో కీలకంగా వ్యవహరించిన గాంధీ మాత్రం సంబరాలు చేసుకోలేదు. జాతియావత్తు ఢిల్లీకి చేరి వేడుకల్లో తనమునకలై ఉండగా గాంధీ మాత్రం ఢిల్లీలో లేరు. ఆయన కోల్కతాలో ఉన్నారు. ఓ వైపు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనే ఆనందం కంటే... దేశం మత ప్రాతిపదికన రెండుగా విడిపోవడం ఆయన్ను చాలా బాధించింది. ముస్లింలంతా తమకు ప్రత్యేక దేశం కావాలంటూ మొహ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో డిమాండ్ చేసి సాధించుకున్నారు. అదే నేటి పాకిస్తాన్. దేశం ఇలా విడిపోయేందుకా అన్ని ఉద్యమాలు పోరాటాలు చేసిందని గాంధీజీ నాడు ఆవేదన చెందారు. ఈ రోజు సిద్ధించిన స్వాతంత్ర్యం భవిష్యత్తులో రెండు దేశాల మధ్య వివాదాలకు దారి తీస్తుందని అప్పుడే గాంధీజీ చెప్పారు.
గాంధీ గోబ్యాక్ నినాదాలు
1947 ఆగష్టు 9వ తేదీన గాంధీజీ కోల్కతాకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న నౌకాలీ అనే ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంది. అక్కడ మతఘర్షణలు జరుగుతున్నాయని తెలుసుకున్న గాంధీ అక్కడకు వెళ్లాలని భావించారు. అయితే బంగ్లాదేశ్లోని ఆ ప్రాంతానికి మాత్రం వెళ్లొద్దని చాలామంది సూచించారు. కలకత్తాలో శాంతి నెలకొంటే మిగతా ప్రాంతాల్లో కూడా శాంతి అమలవుతుందని భావించారు. ఇక చేసేదేమీలేక అక్కడే ముస్లింలు అధికంగా నివసించే మియాబగన్ ప్రాంతంకు సమీపంలోని హైదరీ మంజిల్లో బసచేశారు. అక్కడ చాలామంది గాంధీని కలిసేందుకు వచ్చారు. అక్కడే ప్రార్థనా సమావేశాలు కూడా బాపూజీ నిర్వహించారు. ఇక గాంధీ ముస్లింలకు వ్యతిరేకి అని పేర్కొంటూ ఆయన బస చేసే చోట గాంధీ గోబ్యాక్ అనే నినాదాలు మిన్నంటాయి.
మౌంట్ బాటెన్ ఏమన్నారు..?
ఇక హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలు ఎక్కువైపోతుండటంతో ఆగష్టు 13వ తేదీన స్వయంగా గాంధీనే రంగంలోకి దిగారు. మత ఘర్షణల్లో చురుకైన పాత్రను పోషిస్తున్న వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. శాంతి మంత్రాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల వారితో భేటీ అయ్యారు. అయితే చాలా సందర్భాల్లో గాంధీ చెప్పే మాటలను వారు వినేందుకు సిద్ధంగా లేరు. కానీ గాంధీ మాత్రం ప్రయత్నాలు ఆపలేదు. కొన్ని రోజుల్లో మొత్తం సద్దు మణిగింది. మతఘర్షణలు తగ్గుముఖం పట్టాయి. ఇక మతఘర్షణలకు బ్రేక్ వేసేందుకు మహాత్ముడు చేస్తున్న ప్రయత్నాలను స్వయంగా గమనించాడు లార్డ్ మౌంట్బాటెన్. పంజాబ్లో 55వేల మంది సైనికులను పెట్టి కూడా అక్కడ మతఘర్షణలు నిలువరించలేకపోయాం.. బెంగాల్లో మాత్రం ఒకే ఒక వ్యక్తి దీన్ని నిలువరించగలిగారని మౌంట్ బాటెన్ అన్నారు.
Recommended Video
మనుషులు ఒక్కటిగా లేనప్పుడు...
ఇక ఆగష్టు 15వ తేదీన దేశం యావత్తు స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటుంటే గాంధీజీ మాత్రం 24 గంటల పాటు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు. మౌనం దాల్చి కేవలం చరఖా తిప్పుతూ గడిపారు. "ఇలాంటి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామంటే ముందుగా భగవంతుడికి కృతజ్ఞతలు తెలపాలి. నా పద్ధతి మాత్రం అదే" అని తన స్నేహితుడు అగాథా హారిసన్కు లేఖ రాశారు. అయితే కోల్కతా నగరంలో శాంతి నెలకొనేందుకు ప్రయత్నించి సఫలీకృతులైనందుకు గాంధీజీని అభినందించేందుకు సీ. రాజగోపాలచారి అక్కడకు చేరుకున్నారు. . అయితే మనుషులు ఒక్కటిగా లేనప్పుడు ఈ స్వాతంత్ర్యం తనకు ఆనందం ఇవ్వదని చెప్పారు. హిందువులు ముస్లింలు స్వాతంత్ర్యం కంటే ముందు ఎలాగైతే కలిసి మెలసి ఉన్నారో మళ్లీ అలాంటి పరిస్థితి వస్తే తప్ప నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు కాదని పేర్కొన్నారు.
ఇక కోల్కతా నుంచి గాంధీజీ ఢిల్లీకి వెళ్లాలని భావించారు. అక్కడి నుంచి పంజాబ్కు అటునుంచి లాహోర్కు వెళ్లి అన్నిచోట్ల శాంతి వర్థిల్లేలా తన వంతు పాత్ర పోషించాలని భావించారు. కానీ అది సాధ్యపడలేదు. ఈ ప్రయత్నంలో ఉండగానే బాపూజీని గాడ్సే హత్య చేశాడు. మొత్తానికి నాడు గాంధీజీ ఏదైతే ఊహించారో... ప్రస్తుతం అదే జరుగుతోంది. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోది.