సీఎం జగన్ ఆరోపణలు నిజమేనా: రాత్రంతా కార్యాలయంలోనే ఎన్నికల కమిషనర్: తెర వెనుక ఏం జరిగింది..!
ఏపీలో అనూహ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కరోనా కారణంగా ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసారు. దీని పైన ముఖ్యమంత్రి జగన్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పూర్తిగా చంద్రబాబు కోసం పని చేస్తున్నారని..ఆయన సామాజికవర్గమేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇదే సమయంలో కమిషనర్ తీసుకున్న ఎన్నికల వాయిదా నిర్ణయం కనీసం కార్యాలయంలోని కార్యదర్శికి కూడా తెలియలేదని..ఎక్కడ నుండే ఆర్డర్లు వస్తున్నాయి..ఎవరో రాసి పంపిస్తుంటే ఆయన అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో ఎన్నికల కమిషనర్ సైతం రియాక్ట్ అయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు విచక్షణాధికారం ఉంటుందని..కీలక వ్యక్తులతో చర్చించిన తరువాతనే నిర్ణయం తీసుకున్నానంటూ లేఖ విడుదల చేసారు. అయితే, అసలు ఎన్నికల వాయదా ప్రకటన ముందు ఆయన రాత్రంతా కార్యాలయంలోనే ఉన్నారు..ఇంతకీ అసలు ఏం జరిగిందీ...
ప్రకటన వెనుక ఏం జరిగింది...
ఆదివారం ఉదయం 10కి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ విలేకరుల సమావేశం ఉంటుందని ఎన్నికల సంఘం కార్యాలయం శనివారం రాత్రి మీడియాకు సమాచారం ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ ఆదివారం జారీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కోసమేనని భావించారు. నిమ్మగడ్డ రమేష్కుమార్ శనివారం రాత్రంతా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలోనే బస చేశారు. కొన్ని రోజులుగా ఆయన కమిషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లోనే రాత్రి వేళలో కూడా ఉంటున్నారు. ఎన్నికల నిర్వహణ పైన కార్యాలయానికి అందుతున్న నివేదికలను పరిశీలిస్తే..తగిన సూచనలు చేస్తున్నారు. అదే విధంగా శనివారం రాత్రి సైతం కమిషనర్ తన విధులకు పరిమితం అయ్యారు.
ఉదయమే నిర్ణయం మారిందా..
షెడ్యూల్ ప్రకారం ఆదవారం విడుదల చేయాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్కు సంబంధించిన కాపీలను ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కార్యాలయంలో పనిచేసే జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి ఒకరు రమేష్కుమార్ ఛాంబరుకు తీసుకెళ్లి ఇవ్వబోతే.. తర్వాత పిలుస్తానంటూ ఆ అధికారిని రమేష్కుమార్ వెనక్కి పంపారని తెలిసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న, ఇటీవలి కాలం వరకు ఎన్నికల కమిషన్ ఇన్చార్జి కార్యదర్శిగా కొనసాగిన సత్య రమేష్ను ఆదివారం ఉదయం 9 గంటలకు రమేష్కుమార్ ప్రత్యేకంగా తన ఛాంబర్కు పిలిపించుకున్నారని సమాచారం. కొద్దిసేపు వీరిద్దరి మధ్య ఆంతరంగిక చర్చలు కొనసాగిన తర్వాత.. స్థానిక సంస్థల ఎన్నికల నిలిపివేత నోట్ను సత్యరమేష్ ఛాంబర్లో రహస్యంగా తయారు చేయించినట్లు చెబుతున్నారు.
Recommended Video
కార్యదర్శికి సమాచారం లేదు..
ఇక, కమిషనర్ రమేష్కుమార్, జాయింట్ కమిషనర్ సత్యరమేష్ మధ్య ఉదయం 9.30 గంటల ప్రాంతంలో చర్చలు జరుగుతున్న సమయంలో కార్యాలయంలో పనిచేసే ఇతర అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ గురించి మరోసారి రమేష్కుమార్ వద్ద ప్రస్తావించగా.. తాను చెప్పే వరకూ విలేకరుల సమావేశంలో ఈ నోటిఫికేషన్ వివరాలను ఇవ్వవద్దని ఆయన వారికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఐఏఎస్ అధికారి కమిషన్ కార్యదర్శి హోదాలో పనిచేస్తుంటారు. ఇన్చార్జి కమిషన్ కార్యదర్శి సత్యరమేష్ స్థానంలో నెలన్నర క్రితం రామసుందర్రెడ్డి అనే ఐఏఎస్ అధికారి నియమితులయ్యారు. ఎన్నికల నిలిపివేత నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించే వరకు కమిషన్ కార్యదర్శి రామసుందర్రెడ్డికి కనీసం సమాచారం కూడా లేదని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. చివరకు ఎన్నికల కమిషనర్ ఎన్నికల ప్రక్రియ నిలిపివేత.. ఇద్దరు ఐఏఎస్లు, ఇద్దరు ఐపీఎస్ అధికారులతో పాటు మరికొందరు పోలీసు సిబ్బంది తొలగింపునకు సంబంధించి ఏం మాట్లాడాలన్నది రమేష్కుమార్ ఒక నోట్బుక్లో రాసుకున్నారు. దానినే విలేకరుల సమావేశంలో చదివి వినిపించారు.