వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: కలకలం: అసెంబ్లీ సమావేశాలకు హాజరు.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు
విజయనగరం: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కడుబండి శ్రీనివాస రావు ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. అనారోగ్యానికి గురైన ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. వెంటనే ఆయనను హోమ్ క్వారంటైన్కు తరలించారు. ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలోని ఓ అతిథిగృహంలో హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. త్వరలోనే తాన కోలుకుంటానని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. కొద్దిరోజుల కిందటే శ్రీనివాస రావు అమెరికా నుంచి రాష్ట్రానికి చేరుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి నిర్వహించే వైద్య పరీక్షల్లో భాగంగా ఆయనకు అన్ని రకాల టెస్టులను నిర్వహించారు. అప్పట్లో ఆయనలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదని తెలుస్తోంది. స్వస్థలానికి వచ్చిన తరువాత కొంతమంది పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వైరస్ సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
శ్రీనివాస రావు కరోనా వైరస్ బారిన పడ్డారనే వార్త అధికార పార్టీలో కలకలాన్ని రేపుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తోటి ఎమ్మెల్యేలతో కలివిడిగా తిరిగారని అంటున్నారు. భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉన్నప్పటికీ.. కొందరు ఎమ్మెల్యేలతో మాత్రం ఆయన చనువుగా ఉన్నారని తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లోనూ ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పరిణామాలన్నీ వైసీపీ ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతున్నాయి.
ఏపీలో కరోనా వైరస్ బారిన పడిన మొట్టమొదటి ఎమ్మెల్యే ఆయనే. తెలంగాణలో ఇప్పటికే ఇదివరకు ఆయన గన్మెన్ కరోనా పాజిటివ్గా తేలారు. తెలంగాణలో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, శాసనసభ్యులు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంత రావు వంటి పలువురు నేతలు కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా ఏపీలోనూ అదే తరహా పరిస్థితులు తలెత్తినట్టు కనిపిస్తోంది.
రూటు మార్చిన వైఎస్ జగన్: ఎమ్మెల్యేలు, ఎంపీలతో వరుస భేటీ: అసంతృప్తులపై: సోషల్ మీడియాతోనూ
ఎమ్మెల్యే శ్రీనివాస రావు కాంటాక్టులను ఆరా తీస్తున్నారు అధికారులు ఎవరెవర్ని కలిశారనే విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. కడుబండికా పాజిటివ్గా తేలిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు అధికారులు వైద్య పరీక్షలను నిర్వహించారు. వాటి రిపోర్టులు ఇంకా అందాల్సి ఉంది. ముందు జాగ్రత్త చర్యగా వారిని హోమ్ క్వారంటైన్లో ఉంచారు. ఈ సమాచారం శృంగవరపు కోట నియోజకవర్గంలో కలకలాని దారి తీసింది.