నాటి భారత ఖండ వేగం గుట్టు విప్పిన సైంటిస్ట్లు
వాషింగ్టన్: దాదాపు ఎనిమిది కోట్ల ఏళ్ల కిందట మరో ఖండంలో భాగంగా ఉన్న భారత్ రికార్డ్ వేగంతో వచ్చి యూరేషియా ఖండాన్ని ఢీకొట్టింది. ఇంత వేగం ఎలా సాధ్యమైందన్న దాని పైన... తాజాగా అమెరికాలోని మాసాచ్యుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు ఈ గుట్టు విప్పారు.
అప్పట్లో భారత ఉపఖండం గోండ్వానా అనే మహాఖండంలో భాగంగా ఆఫ్రికాను ఆనుకుని ఉండేది. ఆ తర్వాత భారత ఉపఖండం గోండ్వానా నుంచి విడివడి ఏడాదికి 5 సెంటీ మీటర్ల వేగంతో ఉత్తరదిశగా కదలడం మొదలుపెట్టింది. 4 కోట్ల సంవత్సరాలు పయనించాక అనూహ్యంగా దాని వేగం పెరిగింది.
8 కోట్ల సంవత్సరాల క్రితం భారత ఉపఖండం ఉత్తర దిశగా పయనిస్తున్న వేగం అసాధారణంగా మూడురెట్లు పెరిగి సంవత్సరానికి 15 సెంటీ మీటర్లకు చేరుకుంది. భూఫలకాలు ఇంత వేగంతో కదలడం అసాధారణం. అలా అత్యంత వేగంగా పయనించిన భారత ఉపఖండం 5 కోట్ల సంవత్సరాల క్రితం యురేసియా భూఫలకాన్ని ఢీకొనడంతో హిమాలయాలు ఉద్భవించాయి.
కానీ, భారత ఉపఖండం వేగం 8 కోట్ల సంవత్సరాల క్రితం ఎందుకు అంతగా పెరిగిపోయిందనే ప్రశ్నకు ఇప్పటి వరకుసమాధానం దొరకలేదు. ఎంఐటీ పరిశోధకులు దీనికి తాము సమాధానం కనుగొన్నామని చెబుతున్నారు. భూమి మ్యాంటిల్ పొరలో ఉన్న రెండుచోట్ల భూఫలకాల కుంగుబాటు కారణంగానే భారత ఉపఖండం వేగం పెరిగిపోయిందంటున్నారు.
భూపటలం కింది భాగం మ్యాంటిల్. దీని కింది భాగం భూకేంద్రకం. మ్యాంటిల్ భాగం ద్రవ, ఘన సమ్మేళనంగా ఉండి భూఫలకాల కదలికలకు కారణమవుతుంది. సరిగ్గా ఈ పొరలోనే భారత ఉపఖండం కింద రెండు చోట్ల కుంగుబాటుకు లోనయ్యాయి.
ఒక భూఫలకం తాలూకూ అంచు మరొక ప్లేటు కిందికి చొచ్చుకుపోయే ప్రదేశం. ఇలాంటిది ఒకటి ఉంటేనే ఆ భూఫలకం వేగంగా ప్రయాణిస్తుంది. అలాంటి రెండు జోన్లు ఉండటం వల్లనే భారత్ అంత వేగాన్ని అందుకున్నదని చెబుతున్నారు. 30 మంది విద్యార్థులతో కూడిన ఎంఐటీ శాస్త్రజ్ఞుల బృందం ఒకటి 2013లో హిమాలయ ప్రాంతంలో తవ్వకాలు జరపగా దీనికి సంబంధించిన పురావశేషాలు దొరికాయి.
వీటి ఆధారంగా గుర్తించినట్లు చెప్పారు. 14 కోట్ల ఏళ్ల కిందడ భూమి దక్షిణార్ధగోళంలో ఉన్న గోండ్వానా అనే భారీ ఖండంలో భారత్ కూడా భాగంగా ఉండేదని, ఉత్తర దిక్కులో యూరేషియా ఖండం ఉండేదని, రెండింటికి మధ్య టెథీస్ అనే భారీ సాగరం ఉండేదని, 12 కోట్ల కిందట భారత భూభాగం గోండ్వానా నుండి విడి, ఆ తర్వాత ఉత్తర దిశగా ఏటా ఐదు సెంటీమీటర్ల వేగంతో కదలిందని, 8 కోట్ల ఏళ్ల కిందడ భారత ఖండం వేగం పుంజుకొని, ఏటా 15 సెంటీమీటర్ల వేగం ప్రయాణించిందని చెప్పారు.