సర్వే: శశికళను ఛీకొట్టిన ప్రజలు, పన్నీర్పై జయ ఇలా...
సిఎంగా చిన్నమ్మ శశికళను తమిళ ప్రజలు తిరస్కరిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. పన్నీర్ సెల్వం వైపే వారు మొగ్గు చూపుతున్నారు.
చెన్నై: ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ను ప్రజలు తిరస్కరిస్తున్నట్లు సర్వేల్లో తేలింది. ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిస్థితులైప ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని లక్ష మందికి పైగా యువకులు డిమాండ్ చేశారు.
జయలలిత మృతితో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ సీఎం పదవిని చేపట్టాలని ఆశపడడంపై 'మార్పు' పేరిట అప్పటికప్పుడు ఒక వెబ్సైట్ను రూపొందించి, అందులో రెండు ప్రశ్నలడిగి అభిప్రాయసేకరణ జరిపారు.
'తమిళనాడు సీఎంగా శశికళ కావాలా? పన్నీర్సెల్వమే కొనసాగాలా?' అన్న ప్రశ్నకు పన్నీర్సెల్వం ఉంటేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది. ద్వితీయ స్థానంలో 'తమిళనాడు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలి' అనే సమాధానం వచ్చింది. ఈ రెండు ప్రశ్నలకు సుమారు 1.5 లక్షల మంది జవాబులు పోస్ట్ చేశారు. ఇదిలావుంటే, శశికళను సీఎం పదవి చేపట్టనీయవద్దని హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.
పన్నీర్ సెల్వం ఇలా ఎదిగారు..
తమిళనాడు రాజకీయాల్లో పన్నీర్ సెల్వం అంచెలంచెలుగా ఎదిగారు. అన్నాడీఎంకే పార్టీలో యువ కార్యకర్తగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. క్రమంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టే స్థాయికి ఎదిగిరా. జయలలిత నమ్మిన బంటుగా, ఆమె ఆదేశాలను శిరసావహిస్తూ పన్నీరు సెల్వం ప్రజల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ విషయంలో పలు అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ కంటే పన్నీరు సెల్వమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
శశికళను దూరంగానే పెట్టారు....
జయలలిత శశికళతో ఎంత సన్నిహితంగా ఉన్నా, ఆమె నెచ్చెలిగా పేరు పడినా పార్టీపరంగా శశికళ పాత్ర లేకుండా చూశారు.. జయలలితకు ఆమెపై ఉన్న అపనమ్మకానికి ఇదే తార్కారణమని అంటున్నారు.. పార్టీపరంగా పన్నీరు సెల్వంనే జయ ఎక్కువగా విశ్వసించేవారు. ఆమె జైలుకెళ్లిన సందర్భంలో కూడా పన్నీరు సెల్వంనే ముఖ్యమంత్రిగా ఉండాలని జయ ఆదేశించారు.
పన్నీర్ సెల్వంపై జయలలిత ఇలా...
జయలలిత పన్నీరు సెల్వం గురించి ఓ సమావేశంలో మాట్లాడారు. పన్నీరు సెల్వం అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడని ఆమె ప్రశంసించారు. తన పట్టుదల, అంకిత భావం, కష్టపడే తత్వమే అతను ఉన్నత స్థాయి నాయకుడిగా ఎదగడానికి కారణమని ఆమె చెప్పారు.
రామాయణంలో భరతుడు పన్నీర్..
పన్నీరు సెల్వంను రామాయణంలో భరతుడితో పోల్చారు. రాముడు అడవులకు వెళ్లినప్పుడు భరతుడిని పీఠం ఎక్కమని కోరగా, భరతుడు ఆ స్థానం ఎప్పటికీ రాముడికే చెందాలని పెద్ద మనసుతో తిరస్కరించాడు. రాముడు తిరిగి రాగానే భరతుడు రాజ్యాన్ని సురక్షితంగా రాముడికి అప్పగించాడు. తనకు అంతటి విశ్వాసపాత్రుడు పన్నీరు సెల్వం అని జయలలిత చెప్పడం విశేషం.