రైజినా హిల్స్కు వెళ్లేదెవరు?: ప్రణబ్ వారసుడిపైనే..
ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలై నెలాఖరుతో ముగుస్తుంది. బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ పేరు లేకపోవడం గమనార్హం.
ఢిల్లీ: భారత రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ వారసుడు ఎవరన్న విషయమై అధికార బిజెపిలో జోరుగా చర్చ సాగుతుంది. ఈ పదవికి రేసులో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి(83), కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ (65), లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము పేర్లు ప్రముఖంగా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తున్నది.
ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలై నెలాఖరుతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తదుపరి రాష్ట్రపతిగా సీనియర్ నేత ఎంఎం జోషి, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పేర్లు వినిపిస్తున్నా..ఆశ్చర్యకర విషయమేమంటే బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ పేరు లేకపోవడం గమనార్హం. గుజరాత్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడంలోనూ, 2002లో గోద్రా అనంతర అల్లర్ల నుంచి అనుక్షణం నరేంద్రమోదీకి అద్వానీ గట్టి మద్దతుదారుగా ఉండటం ఆసక్తికర పరిణామం. 2014 లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ వ్యవస్థాపక నేతల్లో ఒకరిగా.. ఈ స్థాయికి పార్టీని అభివ్రుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన అద్వానీకి లోక్ సభ స్పీకర్ పదవిని అప్పగిస్తారని భావించినా అదీ ఇవ్వలేదు.
ఇక రాష్ట్రపతి అవకాశమైనా దక్కుతుందని భావించిన రాజకీయ విశ్లేషకుల అంచనాలను అధిగమించి సీనియర్ నేత ఎంఎం జోషి, సుష్మా స్వరాజ్ తదితరుల పేర్లను బీజేపీ, సంఘ్ పరివార్ పరిశీలిస్తుండటమే ప్రస్తుత దేశ రాజకీయాల్లో వైచిత్రి కానున్నది. మరో గమ్మత్తేమిటంటే ముగ్గురు మహిళలను రాష్ట్రపతి పదవిలో కూర్చుండబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం గమనార్హం.
ఆరెస్సెస్తో అనుబంధంతోపాటు ఇతర సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారుచేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం నడుస్తున్న పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తున్నది. వచ్చేనెల 11వ తేదీన ఈ ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ప్రస్తుతం చర్చల్లో ఉన్న నేతల వివరాలు పరిశీలిద్దాం..

జోషి అవకాశాలివి..
బీజేపీలో సీనియర్ నేతగా, అద్వానీ, యశ్వంత్ సిన్హా తదితరులతో ప్రస్తుతం పార్టీ మార్గదర్శక మండలి సభ్యుడి జాబితాలో చేరిన మురళీ మనోహర్ జోషి 1944లో పదేళ్ల వయస్సు నుంచే ఆర్ఎస్ఎస్తో అనుబంధం కలిగి ఉన్నారు. 1991లో బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1996, 1998, 1998-1999లలో నాటి ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి క్యాబినెట్లో సభ్యుడు. మానవ వనరుల అభివ్రుద్ది శాఖ మంత్రిగా విద్యారంగ కాషాయీకరణకు నాడు జరిగిన ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషించారు.ఆయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ప్రముఖంగా పోరాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో జోషి 1992లో కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు ఏక్తా యాత్ర చేపట్టారు. లాల్చౌక్లో గణతంత్ర దినోత్సవం నాడు జాతీయజెండాను ఆవిష్కరించారు. బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో అరెస్ట్ అయ్యారు. ఇందిరాగాంధీ 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో 19 నెలల జైలు జీవితం గడిపారు.

ఇతర పార్టీలతో సుష్మకు సత్సంబంధాలు
రాష్ట్రపతి పదవికీ సుష్మాస్వరాజ్ పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో విదేశాంగశాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇతర పార్టీల నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎలక్ట్రోరల్ కాలేజీలో గెలుపొందేందుకు అవసరమైన మద్దతు కూడగట్టగల సమర్థురాలు. దీనికి తోడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)తో సత్సంబంధాలు కలిగి ఉండటమే ఆమెకు సానుకూల అంశాలు. ఆమె ఆరోగ్య పరిస్థితులు కూడా చర్చకు వస్తున్నాయి. ఆమె రాష్ట్రపతి పదవికి ఎన్నికైతే కావాల్సినంత విశ్రాంతి లభిస్తుందన్నఅభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటివరకు సంఘ్ పరివార్పై మహిళల పట్ల వివక్ష ప్రదర్శించారన్న అప్రప్రధ తొలగించేందుకు ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.

సుమిత్రా మహాజన్ వెళతారా?
ప్రస్తుత లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ (74) పేరు కూడా రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి బీజేపీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. మద్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నుంచి ఆమె ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం లోక్ సభ స్పీకర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆమెకు ఆర్ఎస్ఎస్తో మంచి సంబంధాలు ఉన్నాయి.

ఒడిశా గిరిజన మహిళ ముర్ము కూడా..
జార్ఖండ్ గవర్నర్ ముర్ము(59) సైతం రాష్ట్రపతి పదవీ రేసు చర్చల్లో ఉండటం గమనార్హం. ఒడిశాకు చెందిన గిరిజన మహిళ. 1997లో కౌన్సిలర్గా రాజకీయ జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము రెండు దశాబ్దాలుగా సామాజిక, రాజకీయ జీవితంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీకి కూడా ఎన్నికైన ఒకసారి ఉత్తమ ప్రజాప్రతినిధి అవార్డును కూడా గెలుచుకున్నారు. ఒడిశాలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆమె చాలా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రపతి పదవికి ఇంతవరకు గిరిజన వ్యక్తి ఎన్నిక కాకపోవడం కూడా ఓ కారణమని చెప్తున్నారు.

ఎన్డీయేకు 75 వేల ఓట్ల మద్దతు కావాలి
రాష్ట్రపతి ఎన్నికలో ఎలక్ట్రోరల్ కాలేజీ కీలక పాత్ర పోషిస్తుంది. 4896 మంది ప్రజాప్రతినిధులు ఉంటారు. వారిలో 776 మంది లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఉంటారు. మిగతా 4,120 మంది ఎమ్మెల్యేలు. ఎంపీలందరికీ సమాన ఓటు ఉంటుంది. కానీ ఎమ్మెల్యేల ఓటు విలువను ఆయా రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన గణిస్తారు. ప్రస్తుతం ఎలక్ట్రోరల్ కాలేజీలో 1.098 మిలియన్ల ఓట్లు ఉన్నాయి. మెజారిటీ కావాలంటే 5,49,001 ఓట్లు కావాలి. బీజేపీకి 282 మంది లోక్ సబ, 56 రాజ్యసభ సభ్యులు, 1,126 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. కానీ జనాభా అధికంగా గల ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో అధికారానికి దూరంగా ఉన్నది. బీజేపీ మద్దతుతో రాష్ట్రపతి ఎన్నిక కావాలంటే నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్కు ఇంకా 75 వేల ఓట్లు కావాలి.

2012లో ఇలా జరిగింది..
2012లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో నాటి యూపీఏ అభ్యర్థి, ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన పీఏ సంగ్మాపై 40 % ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు 2002లో వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో అణు శాస్త్రవేత్త అబ్దుల్ కలాం పేరును బీజేపీ ప్రతిపాదించగా, కాంగ్రెస్ మద్దతు తెలిపింది. కానీ లెఫ్ట్ పార్టీలు లక్ష్మీ సెహగల్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికాయి. కలాం తర్వాత ప్రతిభాపాటిల్ 2007లో రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు.












Click it and Unblock the Notifications