రాక్షస పాలన, ఎదురు తిరగాలి: కార్యకర్త ఇంటికి లోకేష్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన ఉందని, ఎదురు తిరిగే సమయం ఆసన్నమైందన్నారు. త్వరలో నియోజకవర్గాల ఇంచార్జులను నియమిస్తామని ఆయన చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గ నేతలతో లోకేష్ భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పరిస్థితి పైన ఆరా తీశారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఏం చేయాలో వారి నుండి తగిన సూచనలు తీసుకున్నారు.
పార్టీలో కష్టపడి పని చేసే వారికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని లోకేష్ అన్నారు. చంద్రగిరి మండలం కూచువారిపల్లెలో పోలీసుల దాడిలో గాయపడిన కార్యకర్తల ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెసు ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. పోలీసుల తీరును ఆయన తప్పు పట్టారు.
కాగా నారా లోకేష్ ఇటీవల సంక్రాంతి పండుగ కోసం తన స్వగ్రామం నారావారిపల్లికి వెళ్లిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం నారా లోకేష్, నారా బ్రాహ్మిణి, హీరో నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు అందరూ సంక్రాంతి వేడుకల కోసం నారావారిపల్లికి వెళ్లారు. అక్కడే వారు పండుగను జరుపుకున్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న నేపథ్యంలో ఆయన ఖమ్మం జిల్లాలోనే పండుగ జరుపుకున్నారు.
నారా లోకేష్ ఇటీవల ట్విట్టర్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన, తెలంగాణ రాష్ట్ర సమితి పైన చేసిన ట్వీట్స్ సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆయన ట్వీట్స్ తెలుగు తమ్ముళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇప్పుడు నేరుగా ఆయన పార్టీపై దృష్టి సారించడం గమనార్హం.