బలిసిందా?.. తంతా జాగ్రత్త..: సీఐపై సోమిరెడ్డి వివాదాస్పద కామెంట్స్..
అదే సమయంలో తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రాంతంలో గొడవ జరుగుతున్నట్లు తెలియడంతో.. ఆయన అక్కడికి వెళ్లారు. తనకు బదులుగా ఇద్దరు ఎస్ఐలను మార్కెట్ కు పంపించారు.
నెల్లూరు: అధికారం చేతిలోకి రాగానే చాలామంది రాజకీయ నాయకులు ఎక్కడ లేని జులుం ప్రదర్శిస్తుంటారు. కన్నూ మిన్ను కానకుండా నోటికొచ్చినట్లు తిట్టడానికైనా.. అవసరమైతే చేయి చేసుకోవడానికైనా కొంతమంది వెనుకాడరు. ముఖ్యంగా అధికారులపై విరుచుకుపడటంలో ఎక్కడ లేని అత్యుత్సాహం ప్రదర్శించి వార్తల్లోకి ఎక్కుతుంటారు.
తాజాగా ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కూడా ఇవే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అకారణంగా నెల్లూరు నాలుగో టౌన్ కు చెందిన సీఐ సీతారామయ్యపై ఆయన నోరు పారేసుకున్నట్లు తెలుస్తోంది. సీఐని ఇష్టమొచ్చినట్లు తిట్టడమే కాకుండా.. ఆయన్ను వీఆర్ కు పంపించడానికి సోమిరెడ్డి ఒత్తిడి తెచ్చారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఎందుకీ వివాదం:
నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో షెడ్ల నిర్మాణం కోసం చేపట్టిన ఓ కార్యక్రమానికి ఈ వివాదానికి తెరలేపింది. పూలు, పండ్ల వ్యాపారులకు షెడ్ల నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5గం.కు ఒక కార్యక్రమం నిర్వహించగా.. ఆ కార్యక్రమానికి స్థానిక ఎస్ఐలు ఇద్దరు వచ్చారు.
మార్కెట్ కు చేరుకున్న సోమిరెడ్డి.. కార్యక్రమానికి సీఐ రాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. మంత్రి వస్తే సీఐ రావాలని తెలియదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా.. మీకేం బలిసిందా? అంటూ నోరుపారేసుకున్నట్లు చెబుతున్నారు.
సీఐ ఎక్కడికెళ్లారు?:
నిజానికి మంత్రి సోమిరెడ్డి పాల్గొన్న కార్యక్రమానికి సీఐ వెళ్లాల్సి ఉండగా.. అదే సమయంలో తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రాంతంలో గొడవ జరుగుతున్నట్లు తెలియడంతో.. ఆయన అక్కడికి వెళ్లారు. తనకు బదులుగా ఇద్దరు ఎస్ఐలను మార్కెట్ కు పంపించారు.
మంత్రి ఆగ్రహంతో మార్కెట్కు సీఐ:
మంత్రి సోమిరెడ్డి ఆగ్రహించారని తెలియగానే.. సీఐ సీతారామయ్య వెంటనే కూరగాయల మార్కెట్ వద్దకు చేరుకున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సీఐని చూసిన సోమిరెడ్డి.. మరోసారి నోరుపారేసుకున్నట్లు చెబుతున్నారు. మంత్రి వస్తే రావాలని తెలియదా? బలిసిందా? తంతా జాగ్రత్త.. అంటూ ఆయన దూషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
సీఐ ఎదురు సమాధానం చెప్పారని!:
తానేం తప్పు చేశానని తంతా అంటున్నారు? అని సీఐ సోమిరెడ్డిని ఎదురు ప్రశ్నించడంతో ఆయనలో ఆగ్రహం మరింత పెరిగినట్లు తెలుస్తోంది. మర్యాదగా మాట్లాడాలంటూ సీఐ పేర్కొనడంతో సోమిరెడ్డికి అది మింగుడుపడలేదట. దీంతో అదే రోజు ఎస్పీకి, ఐజీకి సీఐ తీరు పట్ల ఫిర్యాదు చేసి ఆయన్ను వీఆర్ కు పంపించాలని ఒత్తిడి తెచ్చారట.
మంత్రి ఒత్తిడి మేరకు సీఐను వీఆర్ కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. సీఐ సీతారామయ్య స్థానంలో సీసీఎస్ సీఐ సుధాకర్ రెడ్డిని కొత్తగా నియమించారు. సీఐ పట్ల సోమిరెడ్డి తన ప్రతాపం చూపించడాన్ని పోలీస్ యంత్రాంగం తప్పు పడుతున్నట్లుగా తెలుస్తోంది.