మంత్రులు తప్పుకోవాలని జగన్: తెలియక మాట్లాడుతున్నారని కోడెల
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సోమవారం ఉదయం కాసేపు ప్రత్యేక హోదాపై రభస చోటు చేసుకుంది. ప్రత్యేక హోదాపై తక్షణమే చర్చించాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఆందోళనకు దిగారు.
ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలని పట్టుబడుతూ వారు ప్లకార్డులు ప్రదర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుల ఆందోళనపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం చెప్పారు. సభా సమయం వృధా చేస్తూ సమయం పెంచాలని కోరడం సబబు కాదని ఆయన అన్నారు.
తాము వాయిదా తీర్మానాన్ని సోమవారం ఉదయమే ఇచ్చామని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత మిమ్మల్ని కలిశారని జగన్ స్పీకర్తో అన్నారు. అయితే, తెలియకుండా మాట్లాడవద్దని, ప్రభుత్వం ఆదివారంనాడే నోటీసు ఇచ్చిందని స్పీకర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ మంత్రులు రాజీనామా చేసి, ప్రత్యేక హోదాపై తీర్మానం చేస్తే బలంగా ఉంటుందని జగన్ అన్నారు.
ప్రత్యేక హోదాపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని, దానిపై చర్చా తీర్మానం ఉంటాయని స్పీకర్ అంతకు ముందు చెప్పారు. అయితే, దాంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు సంతృప్తి చెందలేదు. కేంద్రం నుంచి టిడిపి మంత్రులు తప్పుకోవాలని జగన్ చేసిన డిమాండ్పై యనమల స్పందించారు.
ప్రత్యేక హోదా కోసం తాము నెలల తరబడిగా ప్రయత్నాలు చేస్తున్నామని, తాము చేసే ప్రకటనపై చర్చ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు తమ డిమాండ్లను చెప్పవచ్చునని, ఇప్పుడు నేనే నేనే ముందు ఇచ్చానని అనడం వల్ల ప్రయోజనం ఏమీ లేదని ఆయన అన్నారు. ఆ తర్వాత సభ అబ్దుల్ కలామ్కు నివాళులు అర్పించారు.
శాసనసభా సమావేశాల ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేలు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.