అది నల్లధనం, అడ్డంగా దొరికిన బాబును అరెస్టు చేయరేం?: జగన్ సూటి ప్రశ్న
కాకినాడ: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్కైనప్పటికీ అరెస్టు చేయకపోవడం దారుణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు.
నల్లధనంతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే క్రమంలో ఆడియో టేపుల్లో అడ్డంగా బుక్కైనప్పటికీ చంద్రబాబును అరెస్టు చేయకపోవడమేమిటన్నారు. ఆయన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. కాకినాడలో మాట్లాడారు.
ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్ల మేర ఇచ్చేందుకు యత్నించి పట్టుబడ్డారని, నల్లధనంతో వారిని కొనుగోలు చేసేందుకు నేరుగా చంద్రబాబు ఫోన్లో మాట్లాడారని, వీడియోల్లో దొరికినా చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు. ఇలాంటి సీఎంను ఎక్కడా చూడమన్నారు.
సిగ్గుమాలిన చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సెక్షన్ 8 ప్రస్తావిస్తున్నారన్నారు. ఎన్డీ తివారి విషయంలో చెప్పిన నీతిని చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఆచరించడం లేదని ప్రశ్నించారు. ఎన్డీ తివారికి ఓ నీతి, చంద్రబాబుకు మరో నీతియా అని ప్రశ్నించారు.
చంద్రబాబు హఠాత్తుగా సెక్షన్ 8 ఇప్పుడు ఎందుకంటున్నారని ప్రశ్నించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 అన్నది ఒక భాగం మాత్రమే అన్నారు. చట్టంలోని హామీలు అమలు చేయాలని తాము ప్రధాని మోడీ, కేంద్రమంత్రులను పలుమార్లు కలిశామన్నారు. కాగా, సెక్షన్ 8 పైన చంద్రబాబు గతంలోనే ప్రధాని మోడీకి లేఖ రాసినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.