ఆ మాటకు నన్ను ఎగతాళి చేశారు, రైతులకు పాదాభివందనం!: చంద్రబాబు
సింగపూర్ లాంటి సిటీని నిర్మిస్తానని గతంలో తాను హామి ఇచ్చినప్పుడు చాలామంది ఎగతాళి చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. అయితే సింగపూర్ లాంటి సిటీని నిర్మించడం అసాధ్యమేమి కాదని అన్నారు.
హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని సింగపూర్ తరహాలో తిర్చిదిద్దుతానని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు హామి ఇచ్చిన సంగతి తెలిసిందే. మందడంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్తో ఎంవోయూ కుదుర్చుకున్న నేపథ్యంలో.. చంద్రబాబు గతంలో ఇచ్చిన హామిపై స్పందించారు.
సింగపూర్ లాంటి సిటీని నిర్మిస్తానని గతంలో తాను హామి ఇచ్చినప్పుడు చాలామంది ఎగతాళి చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. అయితే సింగపూర్ లాంటి సిటీని నిర్మించడం అసాధ్యమేమి కాదని అన్నారు. సింగపూర్ కంపెనీలతో 1691 ఎకరాల స్టార్టప్ ఏరియా అభివృద్ధి కార్యక్రమాలు గతేడాదే ప్రారంభం కావాల్సి ఉన్నా.. కొంతమంది పదేపదే కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని చెప్పారు.
రాజధాని రైతుల స్ఫూర్తి, త్యాగం వల్లే ఈ కార్యక్రమం జరుగుతోందని, రాజధానికి భూములిచ్చిన రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. తన మాట మీద నమ్మకం ఉంచి రైతులు 33 వేల ఎకరాల భూములు ఇచ్చారని అన్నారు. భూలోక స్వర్గంగా అమరావతిని నిర్మిస్తామని, భవిష్యత్తులో ప్రపంచంలోని ఐదు నగరాల్లో అమరావతి ఒకటిగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు.
ఇక అమరావతి కోసం టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. గతంలో జపాన్, సింగపూర్ మంత్రులు అమరావతిని సందర్శించేలా చేశామన్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం అమరావతి వైపు ఆసక్తిగా చూస్తుందన్నారు. దానికి మన వనరులు, ప్రణాళికలే కారణమని స్పష్టం చేశారు. కృష్ణా నది, పులిచింతల, నాగార్జున, శ్రీశైలం, గోదావరి.. ఐదు ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వచ్చే ఏకైక నగరం అమరావతి అని చంద్రబాబు తెలిపారు.