'జగన్ వంటి ఉన్మాది లీడర్ ఐతే..!': దేవినేనికి వల్లభనేని వంశీకి కుదిరేనా?
విజయవాడ: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవినేని నెహ్రూ, ఆయన తనయుడు దేవినేని అవినాశ్ గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు. దేవినేని నెహ్రూ చేరికన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకే చెందిన వల్లభనేని వంశీతో పొంతన కుదురుతుందా అనే చర్చ సాగుతోంది.
జిల్లాలోని ఇతర టిడిపి నాయకులతో పొంతన విషయం పక్కన పెడితే వల్లభనేని వంశీ అంశం పైనే చర్చ సాగుతోంది. దేవినేని నెహ్రూ విషయంలో గతంలో వల్లభనేని వంశీకి, మంత్రి దేవినేని ఉమకు మధ్య వాగ్యుద్ధం కూడా నడిచింది. తాజాగా, నెహ్రూ చేరికకు కొన్ని గంటల ముందు వల్లభనేని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.
అయితే, నెహ్రూతో ఇబ్బంది ఉండదని, మీ నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టరని, ఎవరు పని వారు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇప్పటికే టిడిపిలోకి వచ్చే కొత్త వారితో పాత నేతలకు పలుచోట్ల పొంతన కుదరడం లేదు. దేవినేని నెహ్రూ, ఆయన తనయుడు దేవినేని అవినాశ్, మరో నేత బుచ్చిబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు.
టిడిపిలోకి దేవినేని, తనయుడు అవినాశ్
ఏపీలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రతిపక్షం అడుగడుగునా అడ్డు తగులుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ప్రతిపక్షం హిట్ అండ్ రన్ తరహాలో వ్యవహరిస్తోందన్నారు. అవినీతి, ఉన్మాదవాది నాయకుడున్న ఆ పార్టీ మనకు అవసరమా అంటూ వైసిపి పైన తీవ్రంగా ధ్వజమెత్తారు. దేవినేని నెహ్రూ, ఆయన తనయుడు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అవినాష్, కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు తమ అనుచరులతో గురువారం టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.
రాష్ట్రమే నా కుటుంబం
స్వార్థం కోసం నేను రాజకీయాలు చేయడం లేదని, రాష్ట్రం నా కుటుంబం. 5కోట్ల మంది కుటుంబ సభ్యులతో కలిసి కట్టుబట్టలతో బయటకు వచ్చామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాపై ఉందని, దీని కోసం అహర్నిశలు శ్రమిస్తున్నానని చంద్రబాబు అన్నారు. దీనికి మీ సహకారం కావాలని, ఎంతోమంది నాకు గౌరవం ఇస్తారని, కానీ రాజకీయ అవగాహన లేని వ్యక్తి నన్ను చెప్పుతో కొట్టమంటున్నాడని, తనకు బాధ కలిగిందన్నారు.
ఉన్మాది లీడర్ అయితే
కానీ మీకోసం సంయమనంతో ఉంటున్నానని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే నా ధ్యేయమని, ఇటీవల అసెంబ్లీలో బెంచీలు ఎక్కారని, ఉన్మాది నాయకుడుగా ఉంటే ఏం జరుగుతుందో చూశామని, శాసన సభలో సలహాలు సూచనలు ఇస్తే స్వీకరించాలనుకున్నానని, కానీ బెంచీలు ఎక్కారని, మావాళ్లను దూషించారని, అయినా నిగ్రహం కోల్పోవద్దని సూచించానని అన్నారు. వారి తీరును ప్రజలు గమనించారన్నారు. అలాంటి ప్రతిపక్షం ఉంటే రాష్ట్రం ప్రగతి ఎలా సాధిస్తుందన్నారు
పోలవరంపై సన్నాయినొక్కులు
రాజధానికి భూసమీకరణ ప్రపంచంలోనే ఓ చరిత్ర అని, దాన్ని అడ్డుకున్నారని, పట్టిసీమ ఎత్తిపోతలను అడ్డుకున్నారని, ఇప్పుడు పోలవరంపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, రాష్ట్రానికి బాధ్యత ఎందుకు? కేంద్రానికి ఇవ్వాలని అంటున్నారని, నేను మొండి ఘటాన్ని అని చంద్రబాబు అన్నారు. ఉడుంపట్టు పడితే వదలనని, ఇలాంటి కుట్రలు చేస్తే తాట తీస్తానని చంద్రబాబు హెచ్చరించారు.