చిచ్చు.. జగన్ ఆస్తులపై అడిగావా, ఎందుకొచ్చారో తెలుసా: పురంధేశ్వరిపై కాల్వ
బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కాల్వ శ్రీనివాసులు మంగళవారం నిప్పులు చెరిగారు.
అమరావతి: బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కాల్వ శ్రీనివాసులు మంగళవారం నిప్పులు చెరిగారు. పురంధేశ్వరి లేఖ ఇరుపార్టీల మధ్య చిచ్చు రాజేసేలా కనిపిస్తోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరి మంత్రులుగా అయిన వారి గురించి పురంధేశ్వరి ప్రశ్నించడాన్ని కాల్వ తప్పుబటడ్టారు. జగన్ ఆస్తులపై పురంధేశ్వరి ఎప్పుడైనా ప్రశ్నించారా అని నిలదీశారు.
పురంధేశ్వరి వ్యాఖ్యలపై అధిష్టానం చర్చిస్తోందని చెప్పారు. టిడిపికి సంఖ్యాబలం లేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం లేదనే విషయాన్ని పురంధేశ్వరి గుర్తించాలని చెప్పారు.
జగన్కు పురంధేశ్వరి అండ, చంద్రబాబు కార్నర్: బీజేపీ వ్యూహమా?
రాష్ట్రంలో బాధ్యత గల ప్రతిపక్షం లేకుండా పోయిందన్నారు. గతంలో గవర్నర్ భవన్ ఎదుటే.. చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ ప్రకటించారని చెప్పారు.
సంఖ్యాబలం ఉన్న ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకే 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెప్పారు. ఎవరూ ప్రలోభాలతో రాలేదని చెప్పారు. జగన్ ఒక్క ఏడాదిలో 21 బ్లాక్ డేలు ప్రకటించారని ఎద్దేవా చేశారు.