ఎన్ని కుట్రలు చేసినా రాజధాని కడతాం: జగన్కు మంత్రి నిలదీత
గుంటూరు: ప్రజలంతా రాజధానిని కోరుకుంటున్నారని, కొందరు స్వార్థపరులు అడ్డుకునే కుట్ర చేస్తున్నారని మంత్రి నారాయణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి గురువారం విమర్శించారు. జూన్ 1వ తేదీన రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు.
ఏపీ రాజధాని నిర్మాణం 2018 జూన్ నాటికి మొదటిదశ పూర్తి చేస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక అందజేసిందన్నారు. జపాన్ ప్రభుత్వం మైక్రోప్లాన్ రూపొందిస్తుందని మంత్రి నారాయణ చెప్పారు.
ప్రజలంతా రాజధానిని కోరుకుంటే.. కొందరు స్వార్థపరులు దానిని అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా రాజధాని నిర్మాణం ఆగదన్నారు. గ్రామాల్లోకి మెరులుపా వచ్చి తిరిగి వెళ్లే నాయకులు రాజధాని పైన అనుమానముంటే ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు.
కళాకారులకు పెన్షన్లు ఇస్తాం: మురళీమోహన్
తెలుగు నాటకరంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ అన్నారు. నాటకరంగ కళాకారుల సమావేశంలో మాట్లాడుతూ.. కళాకారులకు పెన్షన్లు, హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. రాజమండ్రిలో త్వరలో నంది నాటకోత్సవాలు నిర్వహిస్తామన్నారు.