కెసిఆర్ వర్గ శత్రువులాగా చూస్తున్నారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: శాసనసభలో ఎన్నడూ చూడని ఘటనలు జరుగుతున్నాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మమ్మల్ని వర్గ శత్రువులుగా చూస్తున్నారని ఆరోపించారు.
తన వ్యతిరేకులు తెలంగాణలో జీవించకూడదన్నట్లు కేసీఆర్ తీరు ఉందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్కు 36 శాతం ఓట్లు వస్తే తమకు 22 శాతం వచ్చాయన్నారు. అవిశ్వాసం నోటీస్ ఇద్దామని అసెంబ్లీకి వెళితే అడ్డుకున్నారని దీంతో అసెంబ్లీ కార్యదర్శికి అవిశ్వాసం నోటీస్ పంపించామని రేవంత్ తెలిపారు.
తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోలేకనే తమపై సస్పెన్షన్ వేటు వేశారని ఆయన కెసిఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలను కలుపుకుని పోతామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారని, ఆయితే ఆ పరిస్థితి ప్రస్తుతం మచ్చుకైనా కనిపించడం లేదని ఆయన అన్నారు.
అసెంబ్లీలో జరిగే పరిణామాలపై విపక్షాలు ఆలోచించాలని మరో నేత సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మా గొంతు నొక్కినట్లుగానే త్వరలో మీ గొంతు నొక్కుతారని ఆయన మీడియాను ఉద్దేశించి హెచ్చరించారు. అవిశ్వాస నోటీస్ను చర్చకు స్వీకరించాలని సండ్ర వెంకటవీరయ్య కోరారు.